బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో శతకం సాధించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. దాదాపు 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పంత్.. ఈ మ్యాచ్తోనే రెడ్ బాల్ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. రీఎంట్రీలో ఆడిన తొలి టెస్ట్లోనే శతకం సాధించి తన ఆటను ఘనంగా మొదలుపెట్టాడు.
బంగ్లాదేశ్తో రెండో ఇన్నింగ్స్లో శతకం సాధించిన రిషభ్ పంత్.. ధోనీ టెస్ట్ శతకాల రికార్డ్ను సమం చేశాడు. భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన వికెట్ కీపర్లుగా ఈ ఇద్దరూ సమంగా నిలిచారు. ఈ రికార్డ్కు ధోనీ ఎక్కువ ఇన్నింగ్స్లు తీసుకోగా.. పంత్ మాత్రం అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు.

ఈ క్రమంలోనే అభిమానులు టెస్ట్ల్లో ధోనీ కంటే రిషభ్ పంత్ అత్యుత్తమ వికెట్ కీపర్ అంటూ కొనియాడుతున్నారు. ఈ వాదనపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. అప్పుడే ధోనీతో పంత్ను పోల్చడం సరికాదన్నాడు. ధోనీ కెరీర్ ముందు రిషభ్ పంత్ చాలా చిన్నోడని అభిప్రాయపడ్డాడు.
'ధోనీతో రిషభ్ పంత్ను పోల్చడం సరికాదు. రిషభ్ పంత్ కేవలం 34 టెస్ట్లు మాత్రమే ఆడాడు. ధోనీ ఇప్పటికే అత్యుత్తమ వికెట్ కీపర్గా గుర్తింపు పొంది ఆటకు వీడ్కోలు పలికాడు. కాబట్టి అతని స్థాయికి చేరుకునేందుకు రిషభ్ పంత్కు ఇంకాస్త సమయం ఇవ్వాలి. ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదు. పంత్ ఇలానే ఆడితే మాత్రం భవిష్యత్తులో అత్యుత్తమ వికెట్ కీపర్గా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీ కేవలం కీపింగ్లోనే కాకుండా.. బ్యాటర్గా విలువైన పరుగులు చేశాడు. సారథిగా జట్టును అద్భుతంగా నడిపించాడు. టెస్ట్ల్లో భారత్ను అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లాడు.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ఈ పోలికపై పంత్ స్పందిస్తూ.. బయటి వ్యక్తుల మాటలను తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు. ఆటను ఆస్వాదిస్తూ తనదైన శైలిలో ఆడే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. 'చెన్నై సూపర్ కింగ్స్కు చెపాక్ మైదానం హోమ్ గ్రౌండ్. ఇక్కడ మహీ భాయ్ చాలా క్రికెట్ ఆడాడు. నేను ఇప్పటికే ఇలాంటి పోలికలపై స్పందించాను. బయట వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారనేది నేను పట్టించుకోను. నా అత్యుత్తమ ఆటతీరును ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. చెపాక్లో నా ఆటను ఆస్వాదించా'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.