
చెన్నై: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తండ్రయ్యాడు. అతనీ సతమణి, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దినేశ్ కార్తీకే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'ఇంతకుముందు ముగ్గురం(పెట్ డాగ్తో కలిపి), ఇప్పుడు ఐదుగురమయ్యాం. దీపికా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్.. ఇంతకు మించిన సంతోషం ఏం ఉంటుంది'అని పిల్లలు, పల్లికల్తో ఉన్న ఫొటోను కార్తీక్ షేర్ చేశాడు.
దీనేశ్ కార్తీక్కు దీపికా పల్లికల్ రెండో భార్య. ముందుగా 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజరను పెళ్లాడు. కానీ ఆమె మురళీ విజయ్తో ప్రేమాయణం నడపడంతో 2012లో నిఖితాకు విడాకులు ఇచ్చాడు. 2015లో భారత స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికా పల్లికల్ను ప్రేమించి పెళ్లాడాడు. తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్.. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 26 టెస్ట్లు, 94 వన్డేలు, 32 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ముంగిట కామెంటేటర్గా కూడా అవతారమెత్తాడు. క్రికెట్ నుంచి వైదొలగకముందే వ్యాఖ్యాతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక స్క్వాష్ ప్లేయర్గా 2014 కామన్వెల్త్ గేమ్స్లో డబుల్స్లో స్వర్ణం గెలిచిన దీపికా పల్లికల్, 2018 కామన్వెల్త్ గేమ్స్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో రజతం గెలిచింది. 2014 ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన దీపికా పల్లికల్, 2010 టీమ్ ఈవెంట్, 2014 సింగిల్స్, 2018 సింగిల్స్లో బ్రాంజ్ మెడల్స్ సాధించింది. ప్రోఫెషనల్ స్క్వాష్ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 10లోకి ప్రవేశించిన మొట్టమెదటి భారత స్క్వాష్ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక దీపికాకు 2012లో అర్జున అవార్డు, 2014లో పద్మశ్రీ అవార్డు లభించింది.