పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కీలక సలహా ఇచ్చాడు. టెస్ట్ ఫార్మాట్లో దూకుడు పనికి రాదని, ఓపికగా ఆడాలని సూచించాడు. న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్ సిరీస్లో టీమిండియా 0-3తో క్లీన్ స్వీప్కు గురైన విషయం తెలిసిందే. బెంగళూరు, పుణే, ముంబై వేదికగా జరిగిన మూడు మ్యాచ్ల్లో టీమిండియా చిత్తయ్యింది.
91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి క్లీన్ స్వీప్ గురై అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. మరోవైపు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత గడ్డపై టీమిండియాను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.

ఈ సిరీస్లో 6 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ 91 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 52 పరుగులు. దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ తన వికెట్ పారేసుకున్నాడు. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు.
రోహిత్ అటాకింగ్ బ్యాటింగ్పై స్పందించిన దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అటాకింగ్ గేమ్ వైట్బాల్ ఫార్మాట్లో ఫలితాలిచ్చినా.. టెస్ట్ ఫార్మాట్కు పనికి రాదన్నాడు. టెస్ట్ల్లో రోహిత్ తన బ్యాటింగ్ వైఖరిని మార్చుకోవాలని సూచించాడు.
'టెస్ట్ ఫార్మాట్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రోహిత్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. వైట్బాల్ క్రికెట్లో ఆడిన అప్రోచ్ టెస్ట్ క్రికెట్కు పనిచేయదు. కొద్దిగా ఒత్తిడికి గురికాగానే ప్రమాదకరమైన అటాకింగ్ షాట్కు ప్రయత్నిస్తున్నాడు.
రోహిత్ భారీ షాట్లు ఆడకుండా ఓపికగా ఆడాలి. రోహిత్ శర్మ ఓపెనర్గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఏం చేశాడో ఇప్పుడు అదే చేయాలి. టెక్నిక్ను మాత్రమే నమ్ముకొని ఆడాలి.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. గత 10 ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ 133 పరుగులు మాత్రమే చేశాడు.
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓటమి నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించకుంటే ఈ ఇద్దరి కెరీర్కు ముగింపు పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకుంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.