ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియాకు ప్రయోజనం చేకూర్చేలా సూపర్-8 డ్రా తీసారనే ఆరోపణలపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మెదడున్న ఎవరూ ఈ వ్యాఖ్యలు చేయరని మండిపడ్డాడు. సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలతో గ్రూప్-1లో ఉన్న భారత్కు ఈజీ డ్రానా? అని ప్రశ్నించాడు. అయినా జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా? అని నిలదీసాడు.
లీగ్ దశలో వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి అజేయంగా నిలిచిన భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్తో పాటు జింబాబ్వే సూపర్-8 దశలో గ్రూప్-1లో పోటీపడుతుంది. మరోవైపు లీగ్ దశలో తమ గ్రూప్స్లో రన్నరప్గా నిలిచిన పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు గ్రూప్2లో పోటీపడుతున్నాయి.
అయితే ఈ గ్రూప్ విభజనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. భారత్కు అనుకూలంగా ఈ గ్రూప్స్ను విభిజించారని పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. భారత జట్టుకు అనుకూలంగా ఐసీసీ గ్రూప్స్ విభిజించిందని ఆరోపించారు.
మరోవైపు టోర్నీ రూల్స్ ప్రకారం.. లీగ్ దశలో అజేయంగా నిలిచిన జట్లకు తదుపరి రౌండ్లో ఈజీ టీమ్స్తో పోటీ ఉంటుంది. కానీ ఈసారి, బలమైన జట్లన్నీ ఒకే గ్రూప్లో చేరడంతో.. రెండు అత్యుత్తమ జట్లు సెమీ-ఫైనల్కు ముందే ఇంటిదారి పట్టే పరిస్థితి ఏర్పడింది. దాంతో రెండో స్థానంలో నిలిచిన జట్లకు సెమీస్ మార్గం సులభమైందనే విమర్శలు కూడా వచ్చాయి.

ఈ విమర్శలను ఆకాష్ చోప్రా తనదైన శైలిలో తిప్పికొట్టాడు. భారత్, శ్రీలంక ప్రపంచకప్ టోర్నీకి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని గుర్తు చేశాడు. భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్.. భారత్లో పర్యటించని సంగతి తెలిసిందే. కాబట్టి ఆ జట్టుతో పాటు శ్రీలంక కూడా తమ మ్యాచ్లను స్వదేశంలోనే ఆడాల్సి వచ్చింది. దీంతో నిర్వాహకులు భారత జట్టును ఒక గ్రూప్లో, శ్రీలంక, పాకిస్థాన్ జట్లను మరో గ్రూప్లో ఉంచక తప్పలేదని ఆకాశ్ చోప్రా వివరణ ఇచ్చాడు.
'ఈ టోర్నీ రెండు దేశాల్లో జరుగుతోంది. భారత్ తన మ్యాచ్లను సొంతగడ్డపై, పాకిస్థాన్, శ్రీలంక జట్లు తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడాలి. కాబట్టి వాటిని తప్పనిసరిగా వేర్వేరు గ్రూపుల్లో విభజించాలి. ఈ టోర్నమెంట్ను ఇంకెలా నిర్వహించగలరు?
భారత్కు ఐసీసీకి అనుకూలం అంటున్నారు. అసలు వారికి మెదడు ఉందా? సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లను భారత్ తమ గ్రూప్లో ఎందుకు ఉంచుకోవాలి? దీనివల్ల భారత్కు వచ్చే లాభం ఏంటి? ఆస్ట్రేలియా ఓడిపోయి బయటకు వెళ్తుందని, జింబాబ్వే అగ్రస్థానంలో నిలుస్తుందని ఎవరికి తెలుసు? కాబట్టి, భారత్ గ్రూప్ను సులువైన గ్రూప్గా భావించవద్దు. పూర్తిగా తెలుసుకోకుండా తెలివితక్కువగా మాట్లాడకండి. అది మీకు మంచిది కాదు’అని ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడం వల్ల ప్రయోజనం లేదన్న వాదనను చోప్రా చారిత్రక ఆధారాలతో రుజువు చేశారు. 'అగ్రస్థానంలో నిలిచిన జట్లు ఒకే గ్రూప్లో ఉండటం ఇదే తొలిసారి కాదు. గతంలో 2007, 2009, 2010, 2012 ప్రపంచకప్ టోర్నీల్లో కూడా ఇలానే చేశారు. ముఖ్యంగా 2012లో అగ్రస్థానంలో నిలిచిన అన్ని జట్లు సరిగ్గా ఇలాగే ఒకే గ్రూప్లో ఆడాయి. కాబట్టి, ఇందులో బీసీసీఐకి అనుకూలంగా ఐసీసీ వ్యవహరించిందనే వాదనకు తావు లేదు.’అని ఆకాష్ చోప్రా స్పష్టం చేశాడు.