న్యూఢిల్లీ: ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వరుసగా విఫలమవడంపై భారత మాజీ క్రికెటర్, సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ ఘాటుగా స్పందించాడు. సెలెక్షన్ కమిటీకి బుర్రలేదని, జట్టు ఎంపికపై బీసీసీఐ సోయిలేదని విమర్శించాడు. సెలెక్షన్ కమిటీలో పని చేస్తున్నవారికి లోతైన పరిజ్ఞానం లేదన్నాడు. శిఖర్ ధావన్కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పినప్పుడే ఈ విషయం స్పష్టమైందన్నాడు.
తాజాగా ఓ నేషనల్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బు మీదున్న సోయి.. ఆటగాళ్ల ఎంపిక, జట్టుపై లేదని, డబ్బే ముఖ్యం కాదన్నాడు. 'గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలెక్టర్లకు ఆట, క్రికెట్ సెన్స్పైన లోతైన అవగాహన లేదు.

వారిలో దూరదృష్టి అసలే లేకపోవడం దురదృష్టకరం. 2021లో ఒకేసారి రెండు సిరీస్లు ఆడాల్సి వచ్చినప్పుడు శిఖర్ ధావన్ను కెప్టెన్ను చేశారు. సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లండ్లో ఉన్నప్పుడు శ్రీలంక పర్యటనకు శిఖన్ ధావన్ సారథ్యంలోని జట్టును పంపించారు. ఇక్కడే సెలెక్టర్లకు బుర్రలేదనే విషయం అర్థమైంది. భవిష్యత్తు సారథిని తీర్చిదిద్దుకునే అవకాశం ఇదని వారు గ్రహించలేకపోయారు.
భవిష్యత్తుకు పనికొచ్చే ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చి తీర్చిదిద్దుకోవాల్సింది పోయి ధావన్ను సారథి చేశారు. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు అని చెప్పుకునే బీసీసీఐకి జట్టులో బెంచ్ బలం లేకపోవడం సిగ్గు చేటు. కేవలం ఐపీఎల్ ఆడుతూ.. మీడియా హక్కుల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తే సరిపోదు. విజయమంటే అది ఒక్కటే కాదు'' అని వెంగ్సర్కార్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవ్వడంతో బీసీసీఐ, సెలెక్టర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. అటు వయసు కూడా పెరుగుతుండటంతో అతన్ని సారథ్య బాధ్యతల నుంచి పక్కనబెట్టే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ శర్మ అనంతరం తదుపరి కెప్టెన్ ఎవరా? అంటే సమాధానం లేదు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యా రెడీగా ఉన్నా.. టెస్ట్ ఫార్మాట్కు సారథి సిద్దంగా లేడు. ఈ క్రమంలోనే బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి.