న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. పరుగుల రారాజుగా ప్రపంచ క్రికెట్ను ఏలుతున్నాడు. అయితే కోహ్లీని టీమిండియాకు ఎంపిక చేయడం తన పదవికి ఎసరు తెచ్చిందని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్సర్కార్ అన్నాడు.
తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్సర్కార్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ' 2008 అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీని భారత్ ఏ టీమ్ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు పంపించాం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్ల మధ్య ఎమర్జింగ్ ప్లేయర్ల టోర్నీ జరిగింది.

ఈ మ్యాచ్లు చూసేందుకు చీఫ్ సెలెక్టర్గా నేను ఆసీస్కు వెళ్లాను. భారత్ కంటే బలమైన న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పుడే నాకు భారత జట్టులో ఓ ఖాళీ ఉందని తెలిసింది. దానికి కోహ్లీ సరైనోడని భావించాను. వన్డే సిరీస్ కోసం శ్రీలంక పర్యటన వెళ్లిన భారత జట్టులోకి కోహ్లీని తీసుకున్నా.
నా నిర్ణయంతో మిగతా నలుగురు సెలెక్టర్లు ఏకీభవించినా.. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనీవాసన్కు ఇది నచ్చదని చెప్పారు. వారు తమిళనాడుకు చెందిన బద్రీనాథ్ను ఆడించాలనుకుంటున్నారని తెలిపారు. కోహ్లీ కారణంగా ధోనీ, శ్రీనివాసన్ ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. శ్రీనివాసన్కు చెందిన చెన్నై జట్టుకు బద్రీనాథ్ ఆడుతున్నాడు.
అంతేకాకుండా కోచ్ గ్యారీ కిర్స్టన్ కూడా ఒప్పుకోడని నా సహచర సెలెక్టర్లు అన్నారు. కానీ నేను వినకుండా కోహ్లీని ఎంపిక చేశా. అలా చేయడం వల్ల బద్రీనాథ్కు అవకాశం దక్కదని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నా. ఆ మరుసటి రోజే శ్రీనివాసన్.. బద్రీనాథ్ను ఎందుకు పక్కనపెట్టావ్? అని అడిగారు. నేను వెంటనే ఎమర్జింగ్ టూర్లో అతని సత్తా చూసానని బదులిచ్చాను.

కానీ అతను మాత్రం బద్రీనాథ్ తమిళనాడు తరఫున 800 రన్స్ చేశాడని గుర్తు చేశాడు. వెంటనే త్వరలోనే అతనికి అవకాశం వస్తుంది. కానీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాను. సచిన్ గాయంతో దూరమవ్వగా బద్రీనాథ్కు అవకాశం ఇవ్వగా అతను విఫలమయ్యాడు.
కానీ శ్రీనివాసన్.. ఈ విషయాన్ని కృష్ణమాచారి శ్రీకాంత్ ద్వారా అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శరద్ పవార్ వద్దకు తీసుకెళ్లి నన్ను ఇంటికి పంపించారు. సెలెక్టర్గా అలా నా కెరీర్ ముగిసిపోయింది.'అని వెంగ్సర్కార్ చెప్పుకొచ్చాడు.