అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీపై మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులోకి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తీసుకోకపోవడాన్ని వెంగ్ సర్కార్ తప్పుబట్టాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ సూపర్ ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్కు సెలెక్టర్లు అన్యాయం చేశారని మండిపడ్డాడు.
శుభ్మన్ గిల్ను తప్పించిన సెలెక్టర్లు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. జైస్వాల్ మ్యాచ్ విన్నర్ అని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ టీ20 టీమ్లో రెండు మార్పులే చేసిన సెలెక్టర్లు.. పేలవ ఫామ్లో ఇబ్బంది పడిన శుభ్మన్ గిల్పై వేటు వేసారు. దేశవాళీ క్రికెట్లో రాణించిన ఇషాన్ కిషన్ను బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్గా ఎంపిక చేశారు. దాంతో జితేష్ శర్మపై కూడా వేటు పడింది. రింకూ సింగ్ రీఎంట్రీ ఇచ్చాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో సభ్యుడిగా ఉన్న యశస్వి జైస్వాల్ తాజా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్ట్ మ్యాచ్ల నేపథ్యంలో జైస్వాల్ టీ20లకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో సంజూ శాంసన్ ఓపెనర్గా సత్తా చాటాడు. దాంతో యశస్వి జైస్వాల్కు అవకాశం లేకుండా పోయింది.
టీమ్ సెలెక్షన్పై తాజాగా మాట్లాడిన దిలీప్ వెంగ్సర్కార్.. భారత సెలెక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించాడు. 'యశస్వి జైస్వాల్ను సెలెక్టర్లు ఎందుకు పట్టించుకోవడం లేదో? నాకు అర్థం కావడం లేదు. అతను మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి మ్యాచ్ విన్నర్ను ఎంపిక చేయకపోవడం ఘోర తప్పిదం. జట్టులోకి రావడానికి అతను ఇంకా ఏం చేయాలి?
జట్టులో చోటు లేదని తరుచూ ఆటగాడిని విస్మరిస్తే అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. క్రికెట్ అనేది నమ్మకంతో ఆడే ఆట. శుభ్మన్ గిల్ పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో అతన్ని తొలగించడం సరైన నిర్ణయమే. కానీ అతని స్థానంలో ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడం సరికాదు. నేనైతే అతని స్థానంలో యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసేవాడని. అతను క్వాలిటీ ప్లేయర్. ఈ తరం క్రికెట్కు తగ్గట్లు అతను దూకుడైన ఆరంభాన్ని అందించగలడు. నేనైతే అతన్ని అస్సలు పక్కనపెట్టేవాడిని కాదు.'అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు.