Dilip Doshi:ఆ ఇద్దరు భారమైనా.. సీనియర్లనే రెప్యూటేషన్తోనే భారత జట్టులో కొనసాగుతున్నారు!

న్యూఢిల్లీ: ఫామ్లో లేకపోయినా సీనియర్లు అనే రెప్యూటేషన్తో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా భారత జట్టులో కొనసాగుతున్నారని మాజీ క్రికెటర్ దిలీప్ దోషి అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. ఈ ఫలితంపై స్పోర్ట్స్ కీదా చానెల్తో మాట్లాడిన దిలీప్ దోషి.. ఈ మ్యాచ్లో భారత జట్టు అన్ని విభాగాల్లో విఫలమైందన్నాడు. ఇక ఎప్పటిలా లెఫ్టార్మ్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్మన్ తడబడ్డారన్నాడు. విరాట్ కోహ్లీ మినహా అందరి బ్యాటింగ్ టెక్నిక్లో లోపాలు కనిపించాయన్నాడు. కామన్ సెన్స్ లేకుండా ఆడి మూల్యం చెల్లించుకున్నారని దిలీప్ చెప్పుకొచ్చాడు.

సీనియర్లన్న రెప్యూటేషన్తోనే..
'భారత్పై పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆ రోజు భారత్ కంటే ఆ జట్టు ఎంతో మెరుగ్గా కనిపించింది. అయితే భారత జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం టాపార్డర్ వైఫల్యం. ఎప్పటిలానే భారత బ్యాట్స్మన్ లెఫ్టార్మ్ పేసర్కు తడబడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యే ఇదే. ఓవర్ ద వికెట్ వేసే బంతులను భారత బ్యాట్స్మన్ ఆడలేరు. విరాట్ మినహా మిగతా బ్యాట్స్మెన్ టెక్నిక్లో లోపాలు కనిపించాయి. భారత బ్యాట్స్మన్ కామన్ సెన్స్ లేకుండా ఆడి మూల్యం చెల్లించుకున్నారు. కొద్దిరోజులుగా హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తమ సామర్థ్యం మేరకు ఆడకున్నా కేవలం సీనియర్ ప్లేయర్లనే రెప్యూటేషన్తో జట్టులో కొనసాగుతున్నారు. ఇక వరల్డ్ నెంబర్ వన్ స్పిన్నర్ అయినటు వంటి రవిచంద్రన్ అశ్విన్ను ప్రతీ మ్యాచ్లో ఆడించాలి. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని డ్రాప్ చేయవద్దు 'అని దిలీప్ దోషి అభిప్రాయపడ్డాడు.

ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే..
గెలవాలన్న కసి.. పక్కా ప్రణాళికతో మైదానంలో అడుగుపెట్టిన పాక్.. భారత్కు దిమ్మతిరిగే షాకిచ్చింది. టీ20, వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి తన చేతిలో టీమిండియాకు ఓటమి రుచి చూపించింది. ఈ ఓటమి దేశవ్యాప్తంగా అభిమానుల ఆవేదనను మిగల్చడమే కాకుండా.. ఇప్పుడీ టోర్నీలో భారత ప్రయాణాన్ని కఠినంగా మార్చింది. టోర్నీలో ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్తో ఓటమి బాధను పక్కకుపెట్టి.. వైఫల్యాలపై దృష్టి సారించి.. ఇప్పటికైనా మేల్కొని రాబోయే మ్యాచ్ల్లో జట్టు సత్తాచాటాలి. లేదంటే మరోసారి టీ20 ప్రపంచకప్ అందని ద్రాక్షే అవుతుంది.

ఆ ఇద్దర్నీ పక్కన పెట్టాలి..
మెగాటోర్నీలో భారత్ విజయాల బాట పట్టాలంటే ముందుగా టీమ్ కాంబినేషన్ను మార్చాలి. ఫస్ట్ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయిన భువనేశ్వకుమార్తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండా జట్టుకు భారమైన హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టాలి. భువనేశ్వర్ స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్డూల్ ఠాకూర్కు అవకాశం కల్పించాలి. స్లో బౌలర్ అయినటువంటి శార్దూల్.. కీలక సమయంలో వికెట్లు తీయడంలో దిట్ట. లోయరార్డ్లో ప్రధాన బ్యాట్స్మన్లా భారీ షాట్లు ఆడగలడు. పైగా అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే పాక్తో మ్యాచ్లో శార్దూల్ ఉంటే భారత్ కనీసం పోటీ అయిన ఇచ్చేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అతను సత్తా చాటాడు. జట్టు చాంపియన్గా నిలవడంలో అతని పాత్ర చాలా కీలకం. కాబట్టి అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications