ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి తన ట్రేడ్ మార్క్ నోట్ బుక్ సెలెబ్రేషన్స్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్ నిబంధనలకు విరుద్దంగా.. ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించే విధంగా ఉన్న అతని సంబరాలను తప్పుబడుతూ భారీ జరిమానా, డిమెరిట్ పాయింట్ విధిస్తూ కఠిన చర్యలు తీసుకున్నా.. అతను మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాడు.
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు స్టార్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 58)ను ఔట్ చేసి తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతికి ర్యాన్ రికెల్టన్ ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్ తీసిన ఆనందంలో దిగ్వేష్ రతి పిచ్లో రాసుకున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మనోడు మారలేదురా చారి'అని కామెంట్ చేస్తున్నారు.

ప్రియాన్ష్ ఆర్య వికెట్తో..
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన అనంతరం దిగ్వేష్ రతి తొలి సారి నోట్ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన ప్రియాన్ష్ ఆర్యను క్యాచ్ ఔట్ చేసిన వెంటనే అతని దగ్గరకు పరుగెత్తి నోట్బుక్లో రాసుకుంటున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలను తప్పుబడుతూ.. ఫీల్డ్ అంపైర్.. దిగ్వేష్ రతికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం అతని మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. అయినా అతను వెనక్కి తగ్గలేదు.
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ నమన్ దీర్ను ఔట్ చేసి మళ్లీ నోట్ బుక్ సంబరాలు చేసుకున్నాడు. మళ్లీ అతని మ్యాచ్ ఫీజులో కొత పడటంతో నోట్ బుక్ సంబరాలను కాస్త మార్చుకున్నాడు. పిచ్పై రాసుకుంటున్నట్లు సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సీజన్లో దిగ్వేష్ రతి.. అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, అనికేత్ వర్మ, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, ర్యాన్ రికెల్టన్లతో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.