
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టత లేని ట్వీట్తో ఝలక్ ఇచ్చాడు. తాను బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించాడు. బుధవారం దాదా చేసిన ట్వీట్ అభిమానులను గందరగోళానికి గురి చేస్తోంది. ఆ ట్వీట్లో బీసీసీఐ అధ్యక్ష పదవి విషయాన్ని ప్రస్తావించిన గంగూలీ.. ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.
'భారత క్రికెటర్గా అరంగేట్రం చేసిన 1992 నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న 2022 వరకు నా క్రికెట్ ప్రయాణం గొప్పగా సాగింది. ఈ క్రికెట్ జీవితంలో నాకు కావాల్సినవన్నీ ఇచ్చింది. ముఖ్యంగా నాకు లభించిన మద్దతు వెల కట్టలేనిది. నా ప్రయాణంలో భాగమై అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు. వారి సహాయ సహకారల వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఈ రోజు నేను ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. భవిష్యత్తులో కూడా తనకు ఈ తరహా మద్దతే లభిస్తుందని ఆశిస్తున్నాను'అని దాదా సుదీర్ఘ ట్వీట్లో రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్లో ఎక్కడా బీసీసీఐ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొనలేదు. కానీ అతని వ్యాఖ్యల ఉద్దేశం మాత్రం అదే అన్నట్లుగా అర్థమవుతోంది.
మరోవైపు సౌరవ్ గంగూలీ ట్వీట్పై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించాడు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. దాదా బీసీసీఐ పదవికి రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే గత కొంతకాలంగా భారత క్రికెట్లో జరుగుతున్న వరుస పరిణామాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సెక్రటరీ జై షా అతి జోక్యాన్ని అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సహించడం లేదు. అయితే రాజకీయాల్లోకే వెళ్లే ఆలోచనతోనే గంగూలీ ఈ ట్వీట్ చేసినట్లు మరికొందరు వాదిస్తున్నారు. 2024లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల్లో దాదా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాదాతో బేటీ అయ్యారు. ఈ క్రమంలో రాజకీయ ఎంట్రీ వార్తలకు బలం చేకూర్చేలా గంగూలీ ట్వీట్ చేశాడు.