ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్- యూఏఈ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఐసీసీతో నెలకొన్న వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆలస్యానికి కారణమైంది. భారత్తో మ్యాచ్లో షేక్ హ్యాండ్ వివాదానికి రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రధాన కారణమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆరోపించింది. అతనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని తమ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు చెప్పాడని, ఇది రూల్స్కు విరుద్దమని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అతన్ని వెంటనే టోర్నీ నుంచి తొలగించాలని లేకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది.
ఈ ఫిర్యాదును ఐసీసీ తోసిపుచ్చింది. షేక్ హ్యాండ్ వివాదంలో మ్యాచ్ రిఫరీ పాత్ర లేదని, అతను రూల్స్ ప్రకారమే నడుచుకున్నాడని స్పష్టం చేసింది. అతని తొలగించడం కుదరదని చెప్పిన ఐసీసీ.. యూఏఈ-పాక్ మ్యాచ్కు ఆండ్రీ పైక్రాఫ్ట్నే మ్యాచ్ రిఫరీగా ఎంపిక చేసింది. దాంతో ఆగ్రహానికి గురైన పీసీబీ.. హోటల్ కదిలి వెళ్లవద్దని తమ ఆటగాళ్లను ఆదేశించింది. టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరింపులకు దిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. కాసేపటికే మ్యాచ్ ఆడుతామని ప్రకటించింది. దాంతో నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది.

మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తమ టీమ్ మేనేజర్తో పాటు కెప్టెన్కు క్షమాపణలు చెప్పారని పీసీబీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఏది ఏమైనా మ్యాచ్కు ఆలస్యంగా వచ్చిన పాకిస్థాన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి పిల్ల చేష్టలని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మ్యాచ్ ఆలస్యానికి కారణమైన పాకిస్థాన్ జట్టుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక జట్టు ఆలస్యంగా మ్యాచ్ వస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐసీసీ నియమావళిలో నిర్దిష్ట జరిమానాలు గురించి చెప్పకపోయినా.. ఈ రకమైన సంఘటనలను క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా భావిస్తారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక జట్టు నిర్ణీత సమయానికి మైదానంలోకి రాకపోతే.. గ్రౌండ్లోకి వచ్చిన ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ను ఆలస్యం చేస్తే.. జరిమానా విధించడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు.
అయితే ఈ విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. టోర్నీ నుంచి తప్పుకుంటే లెవల్ 3, 4 నేరంగా భావించి కఠినమైన జరిమానాలను విధిస్తారు. వార్షిక ఆదాయం వాటతో పాటు టోర్నీ నుంచి వచ్చే ఆదాయంలో కూడా కోత విధిస్తారు. అయితే ఈ వ్యవహారంపై ఐసీసీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పాకిస్థాన్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.