న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అతిగా ప్రవర్తించిందని మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ అభిప్రాయపడింది. అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ల చెత్త నిర్ణయాలపై ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడం సాధారణ విషయమేనని తెలిపింది. కానీ హర్మన్ప్రీత్ ఆ విషయాన్ని మైదానంలోనే వదిలేయకుండా.. అతిగా ప్రవర్తించి విమర్శల పాలవుతుందని చెప్పుకొచ్చింది.
బంగ్లాదేశ్తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించారని తీవ్ర ఆగ్రహానికి గురైన హర్మన్ప్రీత్ కౌర్.. తన బ్యాట్తో వికెట్లను బలంగా కొట్టింది. అంతటితో ఆగకుండా క్రీజును వీడే సమయంలో అంపైర్ను బండ బూతులు తిట్టింది.

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్లోనూ అంపైర్లు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పించింది. మరోసారి బంగ్లాదేశ్కు వచ్చినప్పుడు అంపైర్లతో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకొని వస్తామని వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఈ రెండు ఘటనలను సీరియస్గా తీసుకున్న ఐసీసీ భారీ జరిమానాతో పాటు రెండు మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది.
హర్మన్ వ్యవహారంపై స్పందించిన డయానా ఎడుల్జీ ఆమె ప్రవర్తనను తప్పుబట్టింది. 'కీలక మ్యాచ్లో అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఔటైతే భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఏ ఆ ఆటగాడికైనా చాలా కష్టం. కాబట్టి ఐసీసీ విధించే శిక్షకు గురయ్యే తొలి క్రికెటర్ హర్మన్ ఒక్కతే కాదు. అక్కడ అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అర్థమవుతోంది.
గతంలో పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి ఘటనలను చూశాం. అయితే, ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత వాటన్నింటినీ వదిలేయాలి. ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టు కెప్టెన్. ఆమె ప్రవర్తించే తీరు తన సహచర ప్లేయర్లకు ఆదర్శంగా నిలుస్తుంది. అది జట్టు సంస్కృతిపైనా పడుతుంది. అందుకే, హర్మన్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెబుతా.
మ్యాచ్ అనంతరం కూడా హర్మన్ వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదు. సిరీస్ను సమంగా పంచుకున్న తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్లతో కలిసి ఫొటో షూట్ కోసం అంపైర్లనూ పిలవాలని హర్మన్ చెప్పడం ఏమాత్ర సరికాదు. హర్మన్ ఆవేశం నాకు అర్థమవుతుంది. కీలక మ్యాచ్లో కావాల్సినన్ని పరుగులు చేయలేకపోవడంతో వచ్చిన ఆవేశం వల్లే అలా చేసింది. తన పరిధిని దాటి మరీ ప్రవర్తించడంతో విమర్శలపాలు కావాల్సి వచ్చింది'అని ఎడుల్జీ చెప్పుకొచ్చింది.