టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్పై అతని మాజీ సతీమణి ధన శ్రీ వర్మ సంచలన ఆరోపణలు చేసింది. తాను నోరు విప్పుతానని భయపడే చాహల్ లేనిపోని పుకార్లు ప్రచారం చేశాడని పేర్కొంది. తాను చాహల్ను మోసం చేశాననే ప్రచారం పీఆర్ స్టంట్ అని, తన నోరు మూయించేందుకు చేసిన ఎత్తుగడ అని స్పష్టం చేశారు. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మను యుజ్వేంద్ర చాహల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
లాక్డౌన్ సమయంలో డ్యాన్స్ నేర్చుకునేందుకు ధనశ్రీకి దగ్గరైన చాహల్.. ఆమెపై మనసుపారేసుకొని మనువాడాడు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు. మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. ధన శ్రీ వరకు విడాకులు ఇచ్చిన అనంతరం చాహల్.. ఆర్జే మహ్వశ్తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి బహిరంగంగానే తిరుగుతుండటంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మరోవైపు చాహల్తో విడాకుల అనంతరం ఒంటరిగా ఉంటున్న ధనశ్రీ వర్మ.. తన కెరీర్పై ఫోకస్ పెట్టింది.

తాజాగా ఓ టీవీ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా పాల్గొంది. ఈ షోలో తన విడాకులపై వచ్చిన పుకార్లకు వివరణ ఇచ్చుకుంది. ముఖ్యంగా చాహల్ను తాను మోసం చేశానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఇదంతా నెగటివ్ పీఆర్లో భాగంగానే చేశారని ఆరోపించింది. తన సహచర కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్.. చాహల్ను ధనశ్రీ వర్మ మోసం చేసిందనే మాట విన్నానని ఆమెతో అన్నాడు. దాంతో ధనశ్రీ ఘాటుగా స్పందించింది. చాహల్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించింది.
'నేను ఎక్కడ నోరు తెరుస్తానేమోనని భయపడి ఇలాంటి ప్రచారానికి తెరలేపారు. అసలు విషయాలు చెబితే ఈ షో మరోలా మారిపోతుంది. చాహల్తో నాకు విడాకులయ్యాయి. అతని గాసిప్స్ గురించి నాకు అనవసరం. నా జీవితంలో అది ఒక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి. నా గురించి నెగటివ్ మాట్లాడితే మీకు వచ్చే లాభం ఏం లేదు.'అని ధనశ్రీ ఘాటుగా బదులిచ్చింది.
చాహల్తో కాపురం చేస్తూనే ధనశ్రీ మరొకరితో ఎఫైర్ పెట్టుకుందని, ఇది తెలిసే చాహల్ ఆమెను వదిలేసాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ధనశ్రీకి సీక్రెట్ ఎఫైర్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. చాహల్ లేకుండా ఈ ఇద్దరూ కొన్ని కార్యక్రమాలకు హాజరవ్వడం, కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ ప్రచారం తెరపైకి వచ్చింది.