
హైదరాబాద్: తెలుగు హిట్ మూవీ 'పుష్ప'క్రేజ్ మాములుగా లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప: ది రైజ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే పుష్ప డైలాగ్స్, సాంగ్స్ పాపులర్ అయ్యాయి. దాంతో సామున్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలపై రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ స్టార్స్ డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలకు చిందేసారు. ఫేస్ యాప్ టెక్నాలజీతో ఏ బిడ్డా.. ఇది నా అడ్డా అనే పాటను వార్నర్ ఇమిటేట్ చేయగా.. తగ్గేదేలే అనే డైలాగ్ను రవీంద్ర జడేజా పలికాడు. ఈ రెండు వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
తాజాగా టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కూడా పుష్పా సాంగ్కు చిందేసింది. పుష్ప సినిమాలోని 'సామిసామి' పాటకు అదిరే స్టెప్పులేసింది. స్వతహాగా కొరియో గ్రాఫర్ అయిన ధనశ్రీ.. తనదైన శైలిలో దుమ్మురేపింది. ఆమె డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హీరోయిన్ రష్మిక మందన్న కంటే బాగా చేశావని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. తన ఫార్ట్నర్ కొరియోగ్రాఫర్తో ఈ పాటకు చిందేసిన ధనశ్రీ.. ఈ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకుంది. 'మేము ఇద్దరం మళ్లీ వచ్చాము. మా స్టైల్ ఎలా ఉంది. మీ అభిప్రాయం చెప్పండి' అని ధన శ్రీ కాప్షన్ ఇచ్చింది. చాహల్ సైతం ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో వైరల్గా మారింది.
ధనశ్రీ స్టెప్పులకు అల్లు అర్జున్, రష్మిక ఫాన్స్ కూడా ఫిదా అయిపోయారు. వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు. కొందరైతే 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా'అనే సాంగ్కు చిందేయాలని కోరుతున్నారు. ఆ సాంగ్లో డ్యాన్స్ చూడాలని ఉందని ధన శ్రీని రిక్వెస్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషానికి అయితే హద్దే లేకుండా పోయింది. తగ్గేదేలే అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమాలో ఇంకా చాలా పాపులర్ సాంగ్స్ ఉన్నాయని, వాటికి కూడా డ్యాన్స్ చేయాలని కోరుతున్నారు.