ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాడు దేవదత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. నిలకడైన బ్యాటింగ్తో భారత జట్టు తలుపులను బద్దలు కొట్టేందుకు సిద్దమయ్యాడు. గత 4 మ్యాచ్ల్లో 3 సెంచరీలతో భారత సెలెక్షన్ కమిటీకి వార్నింగ్ పంపించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్తో 147 పరుగులు చేసిన పడిక్కల్.. కేరళతో 124 పరుగులు చేశాడు. పాండిచ్చేరిపై 113 పరుగులు చేసిన అతను తమిళనాడుపై మాత్రం విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 22 పరుగులే చేశాడు. 4 మ్యాచ్ల్లోనే 405 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
కేవలం ఈ నాలుగు మ్యాచ్లే కాదు.. పడిక్కల్ ఓవరాల్ 'లిస్ట్-ఏ' కెరీర్ గణాంకాలు అసాధారణంగా ఉన్నాయి. ఇప్పటివరకు 36 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 81.51 సగటుతో 2,364 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. భారత దేశవాళీ క్రికెట్లో మరే ఆటగాడికి కూడా ఈ రికార్డ్ లేదు. నిలకడైన ఆటతో పరుగుల మోత మోగిస్తున్న దేవదత్ పడిక్కల్పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతని గణంకాలను చూసి అవాక్కవుతున్నారు.
శుభ్మన్ గిల్ కంటే పడిక్కల్ ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు. టెక్నిక్, టైమింగ్ విషయంలో శుభ్మన్ గిల్ కంటే దేవదత్ పడిక్కల్ మెరుగ్గా ఉన్నాడని అభిప్రాయపడుతున్నారు. పడిక్కల్ను వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని, శాశ్వత స్థానం కల్పించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సరైన పీఆర్ లేకపోవడం వల్లే పడిక్కల్ గురించి ప్రపంచానికి తెలియడం లేదని, వన్డే ప్రపంచకప్ 2027 కోసం అతన్ని సిద్దం చేయాలని కోరుతున్నారు.

న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్లో పడిక్కల్ అవకాశం దక్కుతుందా? లేదా? అనే సస్పెన్స్గా మారింది. ఒకవేళ జట్టులోకి వచ్చినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న నేపథ్యంలో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది కూడా సందేహంగా మారింది. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ ఇదే జోరు కొనసాగిస్తే సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయకుండా ఉండలేరని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో పడిక్కల్ను ఉంచాలని, అతనికి తగిన అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించనున్నారు.