సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న కర్ణాటక యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సంతోషం వ్యక్తం చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం తన కలని, అది నెరవేరే సమయం ఆసన్నమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా మూడో టెస్ట్కు దూరమైన విషయం తెలిసిందే.
అతని స్థానంలో దేవదత్ పడిక్కల్కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. 'కేఎల్ రాహుల్ మూడో టెస్ట్కూ దూరమయ్యాడు. అతను 90 శాతం మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు.'అని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది.

టీమిండియా పిలుపు అందుకోవడంపై స్పందించిన దేవదత్ పడిక్కల్ నమ్మలేకపోతున్నానని తెలిపాడు. 'టెస్ట్ జట్టులోకి పిలుపు అందుకోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. భారత జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడటం నా కల. కెరీర్లోనే చాలా కఠినమైన కాలం గడిచాక ఈ అవకాశం వచ్చింది. నా కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది.
ముఖ్యంగా అనారోగ్యం నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడం నా జీవితంలో నాకు ఎదురైన అతిపెద్ద సవాల్. ఈ క్రమంలో నేను ఏకంగా 10 కిలోల బరువు తగ్గాను. ఆ సమయంలో సరైన ఆహారం, కండరాలను బలోపేతం చేసుకోవడంపై మాత్రమే ఫోకస్ పెట్టాను. 'అని పడిక్కల్ చెప్పుకొచ్చాడు.
2022-23 సీజన్లో ఉదర సంబంధిత సమస్యతో దేవదత్ పడిక్కల్ బాధపడ్డాడు. అనారోగ్యం కారణంగా ఆ సీజన్ రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్లో నిరాశపరిచాడు.
ఈ సీజన్లో సత్తా చాటిన అతను సోమవారం కర్ణాటక-తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్లో పోరాడి డ్రా చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 15, రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులు చేశాడు. భారత్- ఏ తరఫున ఇంగ్లండ్-ఏపై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గతేడాదే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన పడిక్కల్.. రెండు మ్యాచ్ల్లో 38 పరుగులే చేసి విఫలమయ్యాడు.