దేశవాళీ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్ దేవదత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న పడిక్కల్.. వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో 4 శతకాలు నమోదు చేశాడు.
ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా త్రిపురతో శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన పడిక్కల్ 120 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 108 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్కు ఇది 13వ శతకం. పడిక్కల్ శతకానికి తోడుగా రచిచంద్రన్ సమరణ్(60), అభినవ్ హనోహర్(79) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 332 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(35) నిరాశపర్చాడు.

విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 147 పరుగులు చేసిన పడిక్కల్.. కేరళతో 124 పరుగులు చేశాడు. పాండిచ్చేరిపై 113 పరుగులు చేసిన అతను తమిళనాడుపై మాత్రం విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 22 పరుగులే చేశాడు. తాజాగా త్రిపురపై సెంచరీ బాది.. తన నిలకడను చూపించాడు. ఓవరాల్గా 5 మ్యాచ్ల్లోనే 513 పరుగులు చేసి సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్ను న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నెటిజన్లు కూడా పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్లో పడిక్కల్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అతని సూపర్ ఫామ్ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడే భారత జట్టును ఈ రోజు(శనివారం) ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపాడు. 'జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రోజు మేం సెలెక్టర్లతో మధ్యాహ్నం సమావేశం అవుతున్నాం. ఆ సమావేశం అనంతరం న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటిస్తాం.'అని సైకియా పేర్కొన్నారు. ఈ జట్టులో పడిక్కల్కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.