సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 జరగనుండటంతో రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపాడు. గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో కొత్త ప్లేయర్లను ఎంపిక చేయడం ఇబ్బంది కాదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బోర్డ్ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన టీమ్ సెలెక్షన్ సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సెలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం 15 మంది సభ్యులతో కూడిన భారత టీ20 ప్రపంచకప్ జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.

శుభ్మన్ గిల్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మపై వేటు పడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ను బ్యాకప్ వికెట్ కీపర్గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. రింకూ సింగ్ రీఎంట్రీ ఇవ్వగా.. అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టులో రెండు మార్పులు మాత్రమే జరిగాయి. శుభ్మన్ గిల్, జితేశ్ శర్మ దూరం కాగా.. రింకూ సింగ్, ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు.
మెగా టోర్నీలకు జట్టు ప్రకటించినప్పుడు రిజర్వ్ ప్లేయర్లను కూడా ప్రకటిస్తారు. గాయాలతో జట్టుకు దూరమైన ఆటగాళ్ల స్థానంలో వారిని జట్టులోకి తీసుకుంటారు. అయితే టీ20 ప్రపంచకప్ 2026 టీమ్కు రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించలేదు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దేవజిత్ సైకియా వివరణ ఇచ్చాడు.
'ఈ టోర్నీ మన దేశంలోనే జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఆటగాళ్లకు బదులుగా ఇతరులను ఎంపిక చేయడంలో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ జట్టు కోసం ప్రత్యేకంగా రిజర్వ్ ఆటగాళ్లను ప్రకటించలేదు.'అని దేవజిత్ సైకియా చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్(కీపర్), హర్షిత్ రాణా.