భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దుకు పొగ మంచు కారణం కాదని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖేల్ యాదవ్ అన్నారు. గాలి కాలుష్యం వల్లే మ్యాచ్ రద్దయ్యిందని చెప్పారు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ సమయానికే మైదానాన్ని పొగమంచు కమ్మేయడంతో పలు మార్లు మైదానాన్ని పరిశీలించి, విజిబిలిటిని పరీక్షించిన అంపైర్లు చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ కాలుష్యం లక్నోకు చేరడంతోనే మ్యాచ్ రద్దయ్యిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. 'ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు లక్నోకు చేరుకుంది. అందుకే లక్నోలో జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్ రద్దుకు మంచు కారణం కాదు. విషపూరితమైన గాలి కాలుష్యం.

లక్నోలో స్వచ్ఛమైన గాలి కోసం మేం ఏర్పాటు చేసిన పార్కులను కూడా బీజేపీ నాశనం చేసింది. పార్కుల్లో అనవసరమైన కార్యక్రమాలు నిర్వహించి వాటిని దెబ్బతీసింది. మానవులతో పర్యవరణానికి బిజేపీ శ్రేయస్కారం కాదు. లక్నోలో ఉంటే మాస్క్ ధరించండి'అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
పొగమంచుతో పాటు మైదానం గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించి కనిపించాడు. కాసేపు మైదానంలో ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు పరిమితమయ్యారు. రాత్రి 9.30 గంటలకు చివరిసారిగా మైదాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్ రద్దవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐపై మండిపడుతున్నారు. పొగమంచు కురిసే ప్రదేశాల్లో మ్యాచ్లు ఎందుకని, సౌత్ ఇండియాలో చాలా మైదానాలు అనుకూలంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ టికెట్ డబ్బులు రిటర్న్ చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఈ ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆఖరి మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది.