
కోల్కతా: ఓ దేశవాళీ క్రికెటర్ హనీ ట్రాప్లో పడ్డాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం కోల్కతాకు వెళ్లిన ఢిల్లీ క్రికెటర్ వైభవ్ కంద్పాల్ బలహీనతను లక్ష్యంగా చేసుకొని దుండగులు హనీ ట్రాప్ చేసి లక్షల్లో డిమాండ్ చేసేందుకు కుట్ర పన్నారు. చివరకు కోల్కతా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత చిత్రాలను చిత్రీకరించి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని ఈ నెల 2వ తేదీన వైభవ్.. కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కోల్కతాకే చెందిన శుభంకర్ బిస్వాస్, రిషభ్ చంద్ర, శివ సింగ్లుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి బారాసత్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డేటింగ్ సైట్ ద్వారా ముగ్గురు వ్యక్తులు బాధితుడు వైభవ్ను బస్టాండ్కు పిలిపించారు. కొంతమంది యువతుల ఫొటోలను చూపించారు. సదరు మహిళల్లో ఒకరితో సమయం గడపవచ్చని చెప్పి క్రికెటర్ను నిందితులు నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత నిందితుల్లో ఒకరు అభ్యంతరకర వీడియోలు విడుదల చేస్తానని బెదిరించి వైభవ్ నుంచి రూ. 60వేల వరకు సొమ్ము, అతని మొబైల్, బంగారు నగలను దోచేశాడు. సమాచారం అందుకొన్న పోలీసులు నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. క్రికెటర్ నుంచే కాకుండా మరికొందరి నుంచి కూడా నిందితులు ఇలానే డబ్బును వసూలు చేశారని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇందులో ఇంకెవరిదైనా హస్తం ఉందేమోనని అనుమానంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముంబై జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. గత శనివారం జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ను ముంబై 3 వికెట్ల తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లిన ఢిల్లీ.. విదర్భ చేతిలో ఒక్క పరుగుతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.