టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ఢిల్లీ రంజీ టీమ్ కోచ్, టీమిండియా మాజీ స్పిన్నర్ శరణ్దీప్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తానని, 3-4 సెంచరీలు చేస్తానని చెప్పిన కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం నమ్మశక్యంగా లేదన్నాడు. విరాట్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ ఆదేశాలతో విరాట్ కోహ్లీ.. ఢిల్లీ జట్టు తరఫున రైల్వేస్తో జరిగిన మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ సమయంలో ఇంగ్లండ్ పర్యటన గురించి తమ మధ్య సంభాషణ జరిగిందని తాజాగా శరణ్దీప్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. జియో హాట్స్టార్ షోలో మాట్లాడుతూ.. కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఏ తరఫున ఆడుతానని కూడా చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.

'కోహ్లీ రిటైర్మెంట్కు గల కారణం అతనికి మాత్రమే తెలియాలి. అతని నిర్ణయంతో ప్రతీ ఒక్కరు షాక్ అయ్యారు. ఎలాంటి సంకేతం లేకుండా నిర్ణయాన్ని ప్రకటించాడు. కోహ్లీ వీడ్కోలు పలుకుతాడనే మాట కూడా ఎవరి నోట వినలేదు. ఐపీఎల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు.
రంజీ మ్యాచ్ ఆడే సమయంలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కౌంటీ క్రికెట్ ఆడుతావా? అని కోహ్లీని అడిగాను. అందుకు అతను లేదు.. భారత్ ఏ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడుతానని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనలో రాణించే విషయంపై తనకు సరైన ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు. 2-3 సెంచరీలు కూడా చేస్తానని తెలిపాడు. సీనియర్ బ్యాటర్గా పూర్తి బాధ్యత తీసుకుంటానన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన వైఫల్యంతో అతను చాలా కసిగా కనిపించాడు. అలాంటిది ఏమైందో ఏమో కానీ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనికి ఎలాంటి ఫిట్నెస్ సమస్య లేదు. ఫామ్ కూడా బానే ఉంది.'అని శరణ్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.