
దుబాయ్: ఓపెనర్లు పృథ్వీ షా(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48), శిఖర్ ధావన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్ 2021 సెకండాఫ్లో లీగ్లో భాగంగా జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ల క్లాస్ ఇన్నింగ్స్కు అండగా షిమ్రాన్ హెట్మైర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 29 ) కీలక పరుగులు జోడించాడు. ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/25) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, డాన్ క్రిస్టియన్ తలో వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ మంచి శుభారంభం అందించారు. మ్యాక్స్వెల్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే శిఖర్ ధావన్ బౌండరీ బాదగా.. ఆ మరుసటి ఓవర్లో పృథ్వీ షా సైతం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసిన ఈ జోడీ.. మ్యాక్సీ వేసిన ఐదో ఓవర్లో 6, 4తో 14 పరుగులు పిండుకుంది. ఆ తర్వాతి ఓవర్లో కూడా రెండు బౌండరీలు బాదడంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. అనంతరం ఇదే ఇదే జోరు కనబర్చడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇక క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని హర్షల్ పటేల్ విడదీసాడు. శిఖర్ ధావన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ కొద్దిసేపటికే పృథ్వీ షా సైతం చాహల్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ సైతం ఎక్కువసేపు ఆడలేదు. డానియల్ క్రిస్టియన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అయితే షిమ్రన్ హెట్మైర్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ స్కోర్ బోర్డు వేగం కొనసాగింది. డానియల్ క్రిస్టియన్ వేసిన 15వ ఓవర్లో హెట్మైర్ ఫోర్, సిక్స్ బాదగా.. అయ్యర్ ఓ ఫోర్ కొట్టాడంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడు ఓవర్లు ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్కు ప్రయత్నించిన అయ్యర్.. క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం హర్షల్ పటేల్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన హెట్మైర్.. ఆఖరి ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.