
అయ్యర్ ఆగయా..
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భుజ గాయానికి గురైన శ్రేయస్ అయ్యర్ భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్కు దూరమయ్యాడు. కరోనా వచ్చిన నాలుగు నెలల బ్రేక్ అతనికి కలిసొచ్చింది. ప్రస్తుతం పూర్తి కోలుకున్న అతను నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. అయ్యర్ తిరిగొచ్చినా.. తమ కెప్టెన్ రిషభ్ పంత్ కొనసాగుతున్నాడని ఢిల్లీ టీమ్మేనేజ్మెంట్ ప్రకటించింది.
దాంతో అయ్యర్ బ్యాటింగ్పై ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడు. గాయం కారణంగా చేజారిన టీ20 ప్రపంచకప్ జట్టులోని అవకాశాన్ని అందుకోవాలనే సంకల్పంతో అయ్యర్ ఉన్నాడు. స్టాండ్ బైగా ఎంపికైన అయ్యర్.. ఈ మెగాలీగ్లో సత్తా చాటితే జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అయ్యర్ రాకతో స్టీవ్ స్మిత్ బెంచ్కే పరిమితం కానున్నాడు.

శిఖర్ ధావన్, పృథ్వీషా..
హిట్ ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్, పృథ్వీ షాలు ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఫస్టాఫ్లో ఈ జోడీ దుమ్మురేపింది. ఢిల్లీ సాధించిన 6 విజయాల్లో ఈ ఇద్దరిది కీలక పాత్ర. ఆరంభంలో దంచికొట్టడం భారీ స్కోర్ చేయడం.. లేదా చేజింగ్లో దుమ్మురేపి కొండంత లక్ష్యాన్నైనా సునాయసం చేయడం వీరి లక్ష్యం. లీగ్లో ధావన్ హయ్యెస్ట్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.
గతేడాది ఇదే గడ్డపై జరిగిన లీగ్లో ఈ ఇద్దరు సత్తా చాటారు. చివర్లో పృథ్వీ షా విఫలమైనా.. ధావన్ దుమ్మురేపాడు. అదే జోరును మళ్లీ కొనసాగించాలని భావిస్తున్నాడు. పైగా టీ20 ప్రపంచకప్కు ఎంపికవ్వలేదనే మంట మీదున్నాడు. ఈ లీగ్లో సత్తాచాటి సగర్వంగా జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. పృథ్వీ షా సైతం ఇదే ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాడు.

హెట్మైర్, స్టోయినిస్..
ఇక నాలుగో స్థానంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ హెట్మైర్ బరిలోకి దిగనున్నాడు. ఫస్టాఫ్లో ఈ విండీస్ హిట్టర్ పర్వాలేదనిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ల్లో 25 బంతుల్లో 53 నాటౌట్ దుమ్మురేపాడు. కానీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. హిట్టింగ్ సామర్థ్యం ఉండటంతో హెట్మైర్కే ఢిల్లీ మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వనుంది. ఒకవేళ అతన్ని పక్కనపెట్టాలనుకుంటే స్మిత్ జట్టులోకి రావచ్చు. ఐదో స్థానంలో ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ బరిలోకి దిగనున్నాడు.
గతేడాది యూఏఈ గడ్డపై చెలరేగిన స్టోయినిస్.. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్లో మాత్రం రాణించలేకపోయాడు. అయితే ఆల్రౌండర్ కోటాలో అతను జట్టులో ఉండటం ఖాయం. ఆ తర్వాత వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ రిషభ్ పంత్ రానున్నాడు. ఈ లీగ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని పంత్ భావిస్తున్నాడు.

స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్..
స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. నాలుగేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్కు ఎంపికైన అశ్విన్.. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తాడు. పేసర్లుగా కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్లు బరిలోకి దిగనున్నాడు.
క్రిస్ వోక్స్ దూరమవ్వడంతో నోర్జ్కు లైన్ క్లియరైంది. గతేడాది నోర్జ్, రబడా యూఏఈ గడ్డపై దుమ్మురేపాడు. తమదైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మన్ను వణికించారు. ఫస్టాఫ్లో అవేశ్ ఖాన్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో అనూహ్యంగా గాయపడ్డ అతను.. ఏ మేరకు రాణిస్తోడో అనేది చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, షిమ్రన్ హెట్మైర్, మార్కస్ స్టోయినిస్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్


Click it and Unblock the Notifications
