
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆ జట్టు స్పిన్నర్ అమిత్ మిశ్రా సేవలను కోల్పోగా తాజాగా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా దూరమయ్యాడు. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్ లకు దూరమై లీగ్లో ఏకైక మ్యాచ్ ఆడిన ఇషాంత్.. తాజాగా పక్కటెముల గాయం కారణంగా ఇంటిదారి పట్టాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.
'ఈ నెల 7వ తేదీన ట్రైనింగ్ సెషన్లో ఇషాంత్ బౌలింగ్ చేస్తున్నప్పుడు పక్కటెముకల్లో నొప్పితో బాధపడ్డాడు. దాంతో అతనికి పరీక్షలు చేయించగా.. ఎడమవైపు భాగంలోని పక్కటెముకల్లో సన్నని చీలిక వచ్చిందని తేలింది. ఈ గాయం కారణంగా అతను ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీలోని ప్రతీ ఒక్కరూ ఇషాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం'అని ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇషాంత్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవడానికి అనుమతివ్వాలని ఢిల్లీ ఫ్రాంచైజీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు కూడా విజ్ఞప్తి చేసింది. ఇక సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ గాయాలతో సతమతమవుతుంది. ఆరంభ మ్యాచ్లోనే రవిచంద్రన్ అశ్విన్కు భుజానికి గాయమైంది. అతను కొన్ని మ్యాచ్లకు దూరమై ఆ తర్వాత కోలుకున్నాడు. ఆ వెంటనే అమిత్ మిశ్రా గాయపడ్డాడు.
కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో నితీష్ రాణా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ అందుకునే క్రమంలో అతని రింగ్ ఫింగర్కు గాయమైంది. సర్జరీ చేసుకునే పరిస్థితి ఏర్పడి టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్తో గత శుక్రవారం జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. అతను వారం రోజుల పాటు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. వచ్చే బుధవారం రాజస్తాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఏడు మ్యాచ్లకు గాను ఐదు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఓటమిపాలైంది.