
అసలేం జరిగిందంటే..?
భారీ లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి ఓవర్లో 36 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ను మెక్ కాయ్ వేయగా.. క్రీజులో ఉన్న విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ రోవ్మన్ పావెల్ వరుసగా మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే మెకాయ్ మూడో బంతిని హై ఫుల్ టాస్గా సంధించగా.. పావెల్ అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. అయితే ఈ బంతి నోబాల్లా అనిపించింది. కానీ అంపైర్ నితీన్ మీనన్ మాత్రం బాల్ డిప్ అవుతుందని భావించి ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అప్పటికే ఢిల్లీ డగౌట్లోని ప్లేయర్లు, కోచ్లు నో బాల్ అంటూ అరిచారు. థర్డ్ అంపైర్ సాయన్ని అయినా కోరండంటూ.. సూచించారు. కానీ నితీన్ మీనన్ మాత్రం స్పందించలేదు.

పంత్ లొల్లి చేయకున్నా..
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రిషభ్ పంత్.. క్రీజును వదిలి రావాలని తమ బ్యాటర్లకు సూచించాడు. ప్రవీణ్ ఆమ్రేను మైదానంలోకి పంపాడు. జోస్ బట్లర్తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఇక్కడ పంత్ లొల్లి చేయకున్నా.. పావెల్ ఆ మిగతా మూడు బంతులను కూడా సిక్సర్లుగా బాదేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ గొడవ కారణంగా మెక్కాయ్ రిలాక్స్ అయ్యాడని, దాంతో తర్వాతి మూడు బంతులను ఎలాంటి తప్పిదం చేయకుండా నిలకడగా వేసాడని చెబుతున్నారు. ఎలాంటి గొడవ కాకుంటే ఆ మరుసటి బంతిని వేయడానికి మెక్ కాయ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడని చెబుతున్నారు. పంత్ కారణంగానే ఈ అవకాశం కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీ జరిమానా..
హద్దులు ధాటిన కెప్టెన్ రిషభ్ పంత్తో పాటు ప్రవీణ్ ఆమ్రే, శార్దూల్ ఠాకూర్పై ఐపీఎల్ మేనేజ్మెంట్ కఠిన చర్యలు తీసుకుంది. పంత్ ప్రవర్తనను లెవల్ 2నేరంగా పరిగణించిన ఐపీఎల్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.7 ప్రకారం 100 శాతం మ్యాచ్ ఫీజును కోతగా విధించింది. ఈ లెక్కన పంత్ రూ.1.15 కోట్లు నష్టపోయాడు. పనికిరాని పంచాయితీతో కోటిరూపాలు పోగొట్టుకున్నాడు. ఈ సీజన్లో పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.16 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన పంత్కు ఒక్కో మ్యాచ్కు రూ.1.15 కోట్ల మ్యాచ్ ఫీజు అందనుంది. ఢిల్లీ కోచ్ ప్రవీణ్ ఆమ్రేకు 100 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించింది. శార్దూల్ ఠాకూర్కు 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు.

బట్లర్ జోరు..
ఈ మ్యాచ్లో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్లతో 116) ఈ సీజన్లో మూడో సెంచరీతో చెలరేగగా... దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 54) అర్ధ సెంచరీ చేశాడు. ఆపై కెప్టెన్ సంజు శాంసన్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 46 నాటౌట్) కూడా చెలరేగాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసి ఓడిపోయింది. రిషభ్ పంత్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 44), లలిత్ యాదవ్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37), పృథ్వీ షా (27 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్తో 37) రాణించారు.


Click it and Unblock the Notifications
