ఐపీఎల్ తరహాలోనే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో బ్యాటర్లు బౌండరీల మోత మోగిస్తున్నారు. మంగళవారం గుజరాత్ జెయింట్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్(24 బంతుల్లో 9 ఫోర్లతో 47), స్నేహ్ రాణా(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 29) బౌండరీల మోత మోగించారు.
ముఖ్యంగా సోఫీ డివైన్ వేసిన 17వ ఓవర్లో నికీ ప్రసాద్ వరుసగా నాలుగు బౌండరీలు బాదగా.. ఐదో బంతికి లెగ్బై రూపంలో సింగిల్ వచ్చింది. ఆఖరి బంతి ఆడిన స్నేహ్ రాణా.. తానేం తక్కువ అన్నట్లు సిక్స్ బాదింది. దాంతో ఈ ఓవర్లో వరుసగా 4, 4, 4, 4, 1, 6 లతో 23 పరుగులు వచ్చాయి.
అష్లే గార్డ్నర్ వేసిన 19వ ఓవర్లోనూ రాణా వరుసగా 6, 4, 4 బాదగా.. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. చివరి రెండు బంతుల్లో నికీ ప్రసాద్ బౌండరీతో పాటు సింగిల్ తీసింది. దాంతో ఈ ఓవర్లో 20 పరుగులు రావడంతో ఢిల్లీ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి ఓవర్లో ఈ ఇద్దరూ బ్యాటర్లు 9 పరుగులు చేయలేకపోయారు. ఒత్తిడి తట్టుకోలేక ఓటమికి తల వంచారు.

17వ ఓవర్లో సోఫీ డివైన్ను చితక్కొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆఖరి ఓవర్లో మాత్రం పరుగులు చేయలేక వికెట్ పారేసుకున్నారు. తొలి మూడు బంతులను కట్టుదిట్టంగా వేసిన సోఫీ డివైన్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఒత్తిడి పెంచింది. నాలుగో బంతికి రాణాను ఔట్ చేసి మరింత ఒత్తిడిలోకి నెట్టింది. ఐదో బంతికి సింగిల్ రాగా.. ఆఖరి బంతికి నికీ ప్రసాద్ కూడా వెనుదిరిగింది. దాంతో ఢిల్లీ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Not over yet! 🔥#NikiPrasad fuels the fightback for @DelhiCapitals 💪#TATAWPL #GGvDC 👉 LIVE NOW ➡️ https://t.co/bIK6OvIevx pic.twitter.com/t19ouW22XS
— Star Sports (@StarSportsIndia) January 27, 2026
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. బెత్ మూనీ(46 బంతుల్లో 7 ఫోర్లతో 58), అనుష్క శర్మ(25 బంతుల్లో 8 ఫోర్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(4/31) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. చినెల్లే హెన్రీ(2/38) రెండు వికెట్లు పడగొట్టింది. మరిజన్నే కాప్, నందని శర్మ, మిన్ను మణి తలో వికెట్ తీసారు.
అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది. నికీ ప్రసాద్(24 బంతుల్లో 9 ఫోర్లతో 47), స్నేహ్ రాణా(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 29) రాణించగా.. షెఫాలీ వర్మ(14), లిజెల్లే లీ(11), జెమీమా(16), మరిజన్నే కాప్(0) నిరాశపర్చారు. గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్(4/37) నాలుగు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించింది. రాజేశ్వరి గైక్వాడ్(3/20) మూడు వికెట్లు పడగొట్టింది.