
న్యూఢిల్లీ :ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి మరో 48 గంటల్లో తెరలేవనుంది. ఇప్పటికే పది ఫ్రాంచైజీలు దీనికి సంబంధించిన కసరత్తులో తీరిక లేకుండా ఉన్నాయి. ఎవరిని కొనుగోలు చేయాలి..? ఎంతకు దక్కించుకోవాలనే లెక్కల్లో మునిగిపోయాయి. శని, ఆదివారాల్లో( ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో) మెగా వేలం నిర్వహించేందుకు ఐపీఎల్ వర్గాలు బెంగళూరులో ఏర్పాట్లు చేసేశాయి. ఈ క్రమంలో శనివారం జరిగే టాప్ ప్లేయర్ల వేలంలో నుంచి కనీసం ఏడుగురిని దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.
టీమ్ బ్యాలెన్సింగ్ తీసుకొచ్చే ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతామని ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రె వెల్లడించాడు. 'కోచ్లుగా మేం ఎప్పుడూ టీమ్ బ్యాలెన్సింగ్గా ఉండేలా చూసుకుంటాం. కీలకమైన ఆటగాళ్లు జట్టులోకి తీసుకోవాలని భావిస్తాం. ఇప్పటికే మేం నలుగురు టాప్ ప్లేయర్లు రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, ఆన్రిచ్ నోర్జ్లను రిటైన్ చేసుకున్నాం.
అందులోనే టాపార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్, ఓ స్పిన్నర్ కమ్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. తుది జట్టులో 11 మంది ఆటగాళ్లలో మరో ఏడుగురిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందులోనూ జట్టు బ్యాలెన్సింగ్ చాలా ముఖ్యం. మా ముందున్న అసలు లక్ష్యం కూడా అదే. అయితే నిజాయితీగా చెప్పాలంటే సవాల్తో కూడుకున్నదే. వేలంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. కొన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ సొమ్మును కలిగి ఉన్నాయి'' అని ఆమ్రె వివరించారు.
రిటెన్షన్ ప్రక్రియలో రిషభ్ పంత్(రూ.16 కోట్లు), అక్షర్పటేల్ (రూ.9 కోట్లు), పృథ్వీషాకు( రూ.7.50 కోట్లు), అన్రిచ్ నోర్జేకు (రూ.6.5 కోట్లు)ల కోసం రూ. 39 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ. రూ.51 కోట్ల పర్స్ మనీ ఉంది.