మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఎన్నోఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్ను ముద్దాడింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో వందేమాతరం నామస్మరణ మధ్య తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో దీప్తి శర్మ మ్యాజిక్.. షెఫాలీ వర్మ ఆల్రౌండ్ షో, అమన్ జోత్ కౌర్ స్టన్నింగ్ క్యాచ్ భారత్కు విజయాన్నందించాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 58 ) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 8 ఫోర్లతో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక(3/58) మూడు వికెట్లు తీయగా.. మ్లబా, డిక్లెర్క్, ట్రయాన్ తలో వికెట్ తీసారు.

అనంతరం సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్(98 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 101) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్లలో డెర్కసెన్(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 35) మినహా మరే బ్యాటర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్లలో దీప్తి శర్మ(5/39) ఐదు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా.. షెఫాలీ వర్మ(2/36) రెండు వికెట్లు పడగొట్టింది. తెలుగు తేజం శ్రీ చరణి(1/48)కి ఒక వికెట్ దక్కింది.
299 పరుగుల భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్, తజ్మిన్ బ్రిట్స్(23) ఆచితూచి ఆడారు. తొలి వికెట్కు 51 పరుగులు జోడించిన ఈ జోడీని అమన్ జోత్ కౌర్ స్టన్నింగ్ ఫీల్డింగ్తో విడదీసింది. కళ్లు చెదిరే త్రో సాయంతో తజ్మిన్ బ్రిట్స్ను రనౌట్గా పెవిలియన్ చేర్చింది. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఆ వెంటనే హర్మన్ప్రీత్ కౌర్ తమ స్పెషలిస్ట్ స్పిన్నర్ శ్రీచరణిని బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టింది. బోష్(0)ను శ్రీ చరణి ఎల్బీగా పెవిలియన్ చేర్చింది.
ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన సునే లూస్(23)తో కలిసి లారా వోల్వార్డ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఓపికగా ఆడిన ఈ జోడీ సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఈ జోడీని విడదీసేందుకు హర్మన్ప్రీత్ కౌర్ తెలివిగా షెఫాలీ వర్మను బౌలింగ్కు తీసుకొచ్చింది. ఔటాఫ్ సిలబస్లో బౌలింగ్ చేసిన షెఫాలీ వర్మ రెండో బంతికే సునే లూస్ను రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చింది. దాంతో మూడో వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తన మరుసటి ఓవర్లో డేంజరస్ మరిజన్నే కాప్(4)ను కీపర్ క్యాచ్గా షెఫాలీ పెవిలియన్ చేర్చింది.
అనంతరం సినోలా జఫ్తా కాసేపు పోరాడగా.. దీప్తి శర్మ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. బ్యాటింగ్కు డెరెస్కెన్ రాగా.. లారా వోల్వార్డ్ ఆచితూచి ఆడింది. దాంతో 35 బంతులపాటు సౌతాఫ్రికాకు బౌండరీ రాలేదు. ఇదే సమయంలో డెర్కెసన్కు రాధా యాదవ్ హై ఫుల్ టాస్తో భారీ సిక్సర్ సమర్పించుకుంది. ఇది నో బాల్ కాగా.. ఫ్రీహిట్ అయిన మరుసటి బంతిని కూడా డెర్కెసన్ సిక్సర్ తరలించింది. దాంతో సఫారీ టీమ్పై ఒత్తిడి తగ్గింది. ఈ ఇద్దరూ కాసేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టారు.
డెర్కెసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కూడా దీప్తి శర్మ నేలపాలు చేసింది. మరోవైపు లారా వోల్వార్డ్ 96 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకుంది. ఆ వెంటనే డెర్కెసన్ను దీప్తి శర్మ స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పింది. దాంతో 6వ వికెట్కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తన మరుసటి ఓవర్లో డేంజరస్ లారా వోల్వార్డ్ను పెవిలియన్ చేర్చి విజయాన్ని ఖాయం చేసింది. లారా ఇచ్చిన క్యాచ్ను అమన్ జోత్ అద్భుతంగా ఉంది. ఈ క్యాచ్ టోర్నీకే హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత డిక్లెర్క్ ఇచ్చిన సునాయస క్యాచ్ను జెమీమా వదిలేసింది. కానీ ఖాక(1)ను దీప్తి శర్మ అద్భుత త్రో సాయంతో రనౌట్ చేయడంతో సఫారీ టీమ్పై ఒత్తిడి పెరిగింది. డీక్లెర్క్(18) కాస్త పోరాడినా.. ఆమెను దీప్తి శర్మ క్యాచ్ ఔట్ చేసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.