మౌంట్మాంగనీ: టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో 4 వికెట్లు తీసిన హుడా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు వేసిన దీపక్ హుడా 4 వికెట్లు తీసి 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్పై అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా తన చివరి ఓవర్లో నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసాడు. హ్యాట్రిక్ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.
ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసిన దీపక్ హుడా.. రెండో బంతికి ఇష్ సోదీ, మూడో బంతికి టీమ్ సౌథీని ఔట్ చేసి హ్యాట్రిక్ ఆశలు రేకెత్తించాడు. కానీ హ్యాట్రిక్ బాల్ను ఫెర్గూసన్ సింగిల్ తీయగా.. ఐదో బంతికి మిల్నేను ఔట్ చేసిన హుడా న్యూజిలాండ్ ఇన్నింగ్స్కు తెరదించి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(3/34) హ్యాట్రిక్ వికెట్ సాధించగా.. లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది.
కేన్ విలియమ్సన్(52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీపక్ హుడా (4/10) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసారు. భువనేశ్వర్ కుమార్కు ఓ వికెట్ దక్కింది. కేన్ మామ జిడ్డు బ్యాటింగ్.. న్యూజిలాండ్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇక ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మంగళవారం జరగనుంది.