
ముంబై: సహచర ప్లేయర్ కృనాల్ పాండ్యా తనకు బ్రదర్ లాంటోడని, సోదరుల మధ్య గొడవలు సహజమని లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ దీపక్ హుడా అన్నాడు. తమ మధ్య గతంలో జరిగిన గొడవలు గతమేనని, ఇప్పుడు ఇద్దరి లక్ష్యం లక్నోకు విజయాలందించడమేనని చెప్పాడు. 2020 దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకారణంగా తనపై నోరు పారేసుకున్నాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు.
అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) దీపక్ హుడాదే తప్పని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్కు గుడ్బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు.

అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఉప్పు-నిప్పుగా ఉన్నారు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ రూపంలో మళ్లీ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) టీమ్.. ఈ ఇద్దరు ఆల్రౌండర్లను కొనుగోలు చేసింది. ముందుగా దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు తీసుకున్న లక్నో.. ఆ తర్వాత కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మిడిలార్డర్ కీలకం కానున్న ఈ ఇద్దరూ కలిసి ఆడాల్సి వస్తే.. వీరి విబేధాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఫస్ట్ మ్యాచ్లోనే దీపక్ హుడా- కృనాల్ కలిసిపోయి ఆకట్టుకున్నారు.
తాజాగా తమ గొడవ స్పందించిన దీపక్ హుడా.. ఇప్పుడు తాము ఇతర ఆటగాళ్లలానే ఉంటున్నామని తెలిపాడు. 'కృనాల్ పాండ్యా నా బ్రదర్ లాంటోడు. బ్రదర్స్ మధ్య గొడవలు సహజమే. మేం ఇద్దరం ఒకే లక్ష్యంతో ఆడుతున్నాం. అది లక్నో జట్టు విజయం కోసమే. ఇక మెగా వేలం నేను చూడలేదు. ఇతర ఆటగాళ్లలానే మేం టీమ్ హోటల్లో కలుసుకున్నాం. ఇద్దరమే జట్టు విజయం కోసం ఆడుతున్నాం'అని కృనాల్ చెప్పుకొచ్చాడు.