Deepak Chahar: తన తండ్రి అస్వస్థతకు గురవ్వడంతోనే ఆస్ట్రేలియాతో చివరి టీ20 ఆడలేదని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ తెలిపాడు. సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్.. ఆసీస్తో నాలుగో టీ20లో అవకాశాన్ని అందుకున్నాడు. ఇక చివరి మ్యాచ్కు ముందు అతను జట్టును వీడి ఇంటికెళ్లిపోయాడు.
మెడికల్ ఎమర్జెన్సీతోనే దీపక్ చాహర్ ఇంటికి వెళ్లిపోయాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తన సతీమణి ప్రసవం కోసం దీపక్ చాహర్ వెళ్లాడని చాలా మంది పొరబడ్డారు. కానీ తన తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతోనే ఇంటికెళ్లానని తాజాగా దీపక్ చాహర్ తెలిపాడు.

ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తానని చెప్పాడు. ఇప్పటికే ఈ విషయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు సమాచారమిచ్చానని పేర్కొన్నాడు. 'మేం సరైన సమయానికి మా నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాం. లేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది.
ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. చాలా మంది అభిమానులు ఆస్ట్రేలియాతో చివరి టీ20 ఎందుకు ఆడలేదని అడుగుతున్నారు. మా నాన్న అనారోగ్యమే కారణం. నన్ను క్రికెటర్ను చేయడానికి అతను ఎంతో శ్రమ పడ్డారు. అలాంటిది ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే మైదానంలో మనసు పెట్టి ఆడలేను.
అందుకే, వెంటనే ఇక్కడికి వచ్చేశా. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతనే సౌతాఫ్రికా వెళ్లేందుకు ప్రయాణమవుతా. ఇప్పటికే ఈ విషయంపై కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లకు సమాచారమిచ్చాను.'అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. దీపక్ చాహర్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు.
మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ల సిరీస్ల కోసం టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 17 వరకు సాగనుంది. ముందుగా మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీ20 టీమ్ సౌతాఫ్రికాకు బయల్దేరింది.