సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. తండ్రి అనారోగ్యంతో చివరి నిమిషంలో జట్టుకు దూరమైన దీపక్ చాహర్.. వన్డే సిరీస్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన తన తండ్రి పూర్తిగా కోలుకున్న తర్వాతే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తానని ఈ యువ పేసర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, సౌతాఫ్రికా పర్యటనకు రాలేనని టీమిండియా మేనేజ్మెంట్కు సమాచారమిచ్చినట్లు కూడా దీపక్ చాహర్ తెలిపాడు.

'మేం సరైన సమయానికి మా నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాం. లేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. చాలా మంది అభిమానులు ఆస్ట్రేలియాతో చివరి టీ20 ఎందుకు ఆడలేదని అడుగుతున్నారు. మా నాన్న అనారోగ్యమే కారణం. నన్ను క్రికెటర్ను చేయడానికి అతను ఎంతో శ్రమ పడ్డారు. అలాంటిది ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే మైదానంలో మనసు పెట్టి ఆడలేను.
అందుకే, వెంటనే ఇక్కడికి వచ్చేశా. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతనే సౌతాఫ్రికా వెళ్లేందుకు ప్రయాణమవుతా. ఇప్పటికే ఈ విషయంపై కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లకు సమాచారమిచ్చాను.'అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో ఐదో టీ20కి ముందు ఆకస్మాత్తుగా జట్టును వీడిన దీపక్ చాహర్.. సౌతాఫ్రికా పర్యటనకు ఇంకా రాలేదు. టీ20లతో పాటు వన్డే సిరీస్ జట్టులో దీపక్ చాహర్కు చోటు దక్కింది. ప్రస్తుతం అతని తండ్రి పరిస్థితి సీరియస్గా ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అతను వన్డే సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో మరో పేసర్ను పంపించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
దీపక్ చాహర్కు అదృష్టం ఏ మాత్రం కలిసి రావడం లేదు. కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే అతన్ని గాయాల బెడద వేధించింది. గత రెండేళ్లుగా అతను గాయాలతో సతమతమయ్యాడు. పూర్తిగా కోలుకోని రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతనికి తండ్రి రూపంలో మరోసారి దురదృష్టం తలుపు తట్టింది.