CSK: చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు సారథిగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ను నియమిస్తారని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ వారుసుడిగా పంత్ను సీఎస్కే ఎంపిక చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. అయితే ఇది ఇప్పట్లో జరగదని, ఐపీఎల్ 2025 నాటికి జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన దీప్ దాస్ గుప్తా.. చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు సారథి ఎవరా? అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్ 2025 నాటికి రిషభ్ పంత్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ధోనీకి పంత్ చాలా సన్నిహితంగా ఉంటాడు. ధోనీని రిషభ్ పంత్ను ఆరాధిస్తాడు.

ధోనీకి కూడా పంత్ అంటే ఇష్టమే. వాళ్లిద్దరు గతంలో చాలా కాలం వరకు కలిసి ఆడారు. ఇద్దరూ ఒకే ఆలోచనా విధానం కలిగిన వారు. ఇద్దరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. గెలవాలన్న ఆలోచన తప్ప ప్రతికూల భావనలు దరిచేరనీయరు.'అని దీప్దాస్ గుప్తా కొత్త చర్చకు తెరదీసాడు. కాగా డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా వేలాన్ని నిర్వహించనున్నారు.
గతేడాది ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్.. ఐపీఎల్ 2023 సీజన్తో టీమిండియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న పంత్.. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు అతను సారథ్యం వహించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2023 సీజన్లో ఛాంపియన్గా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ.. అప్కమింగ్ సీజన్ ఆడేందుకు కూడా సిద్దమవుతున్నాడు.