ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్లు శుభారంభాన్ని అందుకోలేకపోయారు. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో తీవ్రంగా నిరాశపర్చారు. ఓవర్కాస్ట్ కండీషన్స్లో ఆసీస్ పేసర్లు చెలరేగడంతో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కేఎల్ రాహుల్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 38), అక్షర్ పటేల్(38 బంతుల్లో 3 ఫోర్లతో 31), నితీష్ కుమార్ రెడ్డి(11 బంతుల్లో 2 సిక్సర్లతో 19 నాటౌట్) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
దాంతో వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(2/20), మిచెల్ ఓవెన్(2/20), మాథ్యూ కుహ్నేమన్(2/14) రెండేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు. భారత్ 136 పరుగులు చేసినా.. డీఎల్ఎస్ లెక్కల ప్రకారం ఆసీస్ లక్ష్యం 131 పరుగులకే తగ్గింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) తీవ్రంగా నిరాశపర్చారు. రోహిత్ను హజెల్ వుడ్.. విరాట్ కోహ్లీని మిచెల్ స్టార్క్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చారు. ఆ వెంటనే కెప్టెన్ శుభ్మన్ గిల్(10)ను నాథన్ ఎల్లిస్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడంతో టీమిండియా 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. దాంతో తొలి పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులే చేసింది.
వర్షం అంతరాయం కలిగించడంతో 11.5 ఓవర్లలో 37/3 స్కోర్ వద్ద మ్యాచ్ ఆగిపోయింది. గంటా 25 నిమిషాల బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభం కాగా.. ఆటను అంపైర్లు 35 ఓవర్లకు కుదించారు. శ్రేయస్ అయ్యర్(11)ను హజెల్ వుడ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మళ్లీ వర్షం రావడంతో ఆట 14.2 ఓవర్లలో 46/4 స్కోర్ వద్ద ఆగిపోయింది.
18 నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ తిగిరి ప్రారంభం కాగా.. ఆటను 32 ఓవర్లకు కుదించారు. మరో 16 నిమిషాల వ్యవధిలోనే వర్షం మళ్లీ ఆటంకం కలిగించింది. గంట బ్రేక్ తర్వాత ఆట ప్రారంభం కాగా మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. 50 ఓవర్ల మ్యాచ్ కాస్త 26 ఓవర్ల గేమ్గా మారడంతో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా అక్షర్ పటేల్ వరుస బౌండరీలతో సత్తా చాటాడు. అతను ఔటైనా కూడా కేఎల్ రాహుల్ భారీ సిక్స్లు, బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మాథ్యూ షార్ట్ బౌలింగ్లో వరుస బంతుల్లో రాహుల్ కొట్టిన రెండు సిక్స్లు ఈ ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచాయి. దూకుడుగా ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్(10) ఔటైనా.. నితీష్ కుమర్ రెడ్డితో కలిసి రాహుల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని మిచెల్ ఒవెన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో అర్ష్దీప్ సింగ్(0) డైమండ్ డక్గా వెనుదిరిగాడు. చివర్లో సిరాజ్ సాయంతో నితీష్ రెండు భారీ సిక్సర్లతో 136 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు.