టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015 భారత పర్యటనలో కోహ్లీ తనపై ఉమ్మేశాడని తెలిపాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తాను బూతు పదంతో తిట్టానని తాజాగా డీన్ ఎల్గర్ గుర్తు చేసుకున్నాడు.
ఇటీవల భారత్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్తోనే డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాజాగా 'బాంటర్ విత్ బాయ్స్' అనే ఓ పోడ్ కాస్ట్లో పాల్గొన్న డీన్ ఎల్గర్.. విరాట్ కోహ్లీకి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు.

'2015లో నేను తొలిసారి భారత పర్యటనకు వెళ్లాను. మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో నేను బ్యాటింగ్కు దిగాను. నేను విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడటం అదే తొలిసారి. అక్కడి పిచ్ చూస్తే నాకు పెద్ద జోక్లా అనిపించింది. అలాంటి పిచ్పై బ్యాటింగ్ చేయడం సవాలుగా నిలిచింది.
బ్యాటింగ్ చేస్తున్న నాపై అశ్విన్, జడేజా సూటి పోటి మాటలతో స్లెడ్జింగ్కు దిగారు. నేను కూడా వారికి ధీటుగా బదులిచ్చాను. అప్పుడే విరాట్ కోహ్లీ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. నాపై ఉమ్మేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నేను ఓ బండ బూతును ఉపయోగించి, బ్యాట్ తో కొడతానంటూ కోహ్లీని బెదిరించాను.
అప్పటికే కోహ్లీ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతుండటం... ఆ జట్టులోనే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ కూడా ఉండటంతో నా యాసను, నేను వాడిన బూతును అర్థం చేసుకున్నాడు. వెంటనే కోహ్లీ కూడా అదే బూతు మాటను ఉచ్ఛరిస్తూ హేళన చేయడం మొదలుపెట్టాడు.
దాంతో... వీడితో పెట్టుకోవడం అనవసరం అని వదిలేసాను. ఆ తర్వాత 2017-18 సీజన్లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. కోహ్లీ నా వద్దకు వచ్చి... ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా? అని అడిగాడు. అంతేకాకుండా భారత పర్యటనలో నేను నీతో ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు.
కోహ్లీ ప్రతిపాదనకు నేను ఒప్పుకున్నాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. తెల్లవారుజామున 3 గంటల వరకు మేమిద్దరం కలిసి తాగాం. ప్రస్తుతం పూర్తిగా మానేసినా.. అప్పుడు కోహ్లీ అల్కహాల్ తీసుకుంటున్నాడు.'అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ఎల్గర్ రిటైర్మెంట్ సందర్భంగా అతన్ని కోహ్లీ ఆత్మీయంగా కౌగిలించుకొని వీడ్కోలు పలికాడు.