ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ అన్నాడు. భారత్తో కేప్టౌన్ వేదికగా రెండు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో రెండు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన డీన్ ఎల్గర్.. ఈ గెలుపు క్రెడిట్ భారత బౌలర్లదేనని తెలిపాడు.
'ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఈ మ్యాచ్లో ఓడినా మాకు కొన్ని సానుకూలంశాలు లభించాయి. తొలి ఇన్నింగ్స్లో మా బ్యాటింగ్ వైఫల్యం ఓటమిని శాసించింది. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. పిచ్ కండిషన్స్ను చక్కగా ఉపయోగించుకుంది. ఈ సిరీస్ డ్రా అయినా మాకు అనేక సానుకూలంశాలు లభించాయి.

కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. 2-0తో సిరీస్ గెలిచి ఉంటే బాగుండేది. డ్రా అయినా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఈ సిరీస్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన విధానం అసాధారణం. ఈ పిచ్ పేస్కు అనుకూలంగా ఉంది.
కళ్లను మోసం చేసింది. మాములుగా చూసినప్పుడు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండేలా కనిపించింది. కానీ అందరి ఊహాలకు భిన్నంగా స్పందించింది. దురదృష్టవశాత్తు ఈ పిచ్కు మేం బలయ్యాం. ఇది మాకు పెద్ద గుణపాఠం. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉపయోగపడుతుంది. ముందుగా బ్యాటింగ్ తీసుకున్నంకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. రోహిత్ శర్మ టాస్ గెలిచినా అదే చేసేవాడు.'అని డీన్ ఎల్గర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్తో డీన్ ఎల్గర్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. సౌతాఫ్రికా తరఫున 86 టెస్ట్లు ఆడిన డీన్ ఎల్గర్.. 37.92 యావరేజ్తో 5347 పరుగులు చేశాడు. 14 సెంచరీలతో పాటు 23 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన డీన్ ఎల్గర్కు భారత ఆటగాళ్లు ఘన వీడ్కోలు అందించారు.
విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా సంతకం చేసిన జెర్సీ అందించగా.. రోహిత్ శర్మ టీమిండియా ఆటగాళ్లందరి సంతకాలతో కూడిన జెర్సీని అందజేశాడు.