ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి పరుగుల సునామీ సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 46) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది.
షెహ్బాజ్ అహ్మద్(29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీష్ కుమార్ రెడ్డి(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

తొలి ఓవర్ నుంచే..
ఖలీల్ అహ్మద్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ 6, 4, 4 బాదగా.. అభిషేక్ శర్మ ఓ బౌండరీ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. స్పిన్నర్ లలిత్ యాదవ్ను రిషభ్ పంత్ బరిలోకి దించగా.. ట్రావిస్ హెడ్ 6, 6, 4 బాదగా అభిషేక్ శర్మ ఓ బౌండరీ కొట్టడంతో 21 పరుగులు వచ్చాయి. అన్రిచ్ నోర్జ్ వేసిన మూడో ఓవర్లో ట్రావిస్ హెడ్, 4, 4, 0, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు.
దాంతో సన్రైజర్స్ 3 ఓవర్లలోనే 62 పరుగులు చేసుకోగా.. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లలిత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మ ఓ సిక్సర్ కొట్టగా.. ట్రావిస్ హెడ్ మరో రెండు సిక్స్లు బాదాడంతో 21 పరుగులు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో ఓవర్నూ అభిషేక్ శర్మ 3 సిక్స్లతో 20 పరుగులు పిండుకున్నాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ 5 ఓవర్లలోనే 103 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా సన్రైజర్స్ చరిత్రకెక్కింది.
36 బంతుల్లో 26 బౌండరీలు..
ముఖేష్ కుమార్ వేసిన ఆరో ఓవర్లోనూ ట్రావిస్ హెడ్ వరుసగా 4, 4, 4 4, 0, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక పవర్ ప్లే స్కోర్. టీ20 క్రికెట్ చరిత్రలో కూడా పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. పవర్ ప్లేలోని 36 బంతుల్లో 6 బాల్సే డాట్ అవ్వగా.. సన్రైజర్స్ బ్యాటర్లు 11 సిక్స్లు, 13 ఫోర్లు కొట్టారు.
మలుపు తిప్పిన కుల్దీప్ యాదవ్..
131 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ ఓపెనింగ్ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్(1)లను పెవిలియన్ చేర్చాడు.
సెంచరీ దిశగా సాగుతున్న ట్రావిస్ హెడ్ను మరుసటి ఓవర్లో ఔట్ చేశాడు. డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్(15)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో సన్రైజర్స్ హైదరాబాద్ పరుగుల వేగం తగ్గింది. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి, షెహ్బాజ్ అహ్మద్ చెలరేగారు. ఐదో వికెట్కు 57 పరుగులు జోడించారు. నితీష్ కుమార్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. అబ్దుల్ సమద్(13)ను ముఖేష్ కుమార్ ఔట్ చేశాడు. షెహ్బాజ్ తనదైన శైలిలో చెలరేగి జట్టు స్కోర్ను 260 పరుగులు ధాటించాడు.