
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్, అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ అదరగొట్టాడు. అద్భుత బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. గత రెండు మ్యాచ్ల్లో (0/31), (1/25) తేలిపోయిన రషీద్.. ఈ మ్యాచ్తో తన పూర్వ వైభవాన్ని అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో రషీద్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో మూడు వికెట్లు తీసి 14 పరుగులే ఇచ్చాడు. కీలక వికెట్లు అయిన శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్ల వికెట్లను ఖాతాలో వేసుకుని ఢిల్లీ పతనాన్ని శాసించాడు. తన లెగ్ బ్రేక్లతో ఢిల్లీ బ్యాట్స్మెన్కు చెమటలు పట్టించాడు. రషీద్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. మరొక స్పిన్నర్ అభిషేక్ శర్మ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చినా రషీద్ మాత్రం తన లైన్ను తప్పకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు.
ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. రషీద్ ఖాన్కు తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించారు. భువనేశ్వర్ కుమార్(2/25), ఖలీల్ అహ్మద్(1/43), నటరాజన్ (1/25) అద్భుత యార్కర్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 53), కేన్ విలియమ్సన్(26 బంతుల్లో 5 ఫోర్లు 41) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా (2/21), అమిత్ మిశ్రా (2/35) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్(34), రిషభ్ పంత్(28), హెట్మైర్(21) మినహా అంతా విఫలమయ్యారు.