ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ఎండ ఎక్కువగా ఉందనే బ్యాటింగ్ ఎంచుకున్నానని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ప్రారంభంలో చాలా వేడిగా ఉంటుంది. పిచ్ చూడటానికి బాగుంది. భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. గతేడాది మా బ్యాటింగ్తో ఢిల్లీ పతనాన్ని శాసించాం. ఈ సారి కూడా అలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. మా బలాలకు తగ్గట్లు ఆడుతున్నాం. గత మ్యాచ్ ఓటమితో మేం ఎలాంటి ఆందోళనకు గురవ్వలేదు. దూకుడుగా ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి.

గత మ్యాచ్లో ఓడినా మేం ఆఖరి వరకు పోరాడాం. కొన్ని విషయాల్లో తప్పిదాం చేశాం. అయినా సుమారుగా 200 పరుగులు చేశాం. మా కుర్రాళ్లంతా చాలా సానుకూలంగా ఉన్నారు. విజయం సాధించాలనే కసితో ఉన్నారు. సిమర్జిత్ సింగ్ స్థానంలో జీషన్ అన్సారీ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఉత్తరప్రదేశ్కు చెందిన జీషన్ అన్సారీ లెగ్ స్పిన్నర్. స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు సన్రైజర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను యూపీ తరఫున 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. మెగా వేలంలో అతన్ని సన్రైజర్స్ రూ. 40 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. 'మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నా. గత మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లోనే బంతి ఎక్కువగా తిరిగింది. సన్రైజర్స్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే మేం ఇక్కడ ఒక మ్యాచ్ ఆడాం. ప్రత్యర్థులకు తగ్గట్లు మేం వ్యూహాలు రెడీ చేసుకుంటాం. బౌలింగ్ విభాగం దైర్యంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థి బ్యాటర్లకు తగ్గట్లు బౌలింగ్ వ్యూహాలను సిద్దం చేశాం. తుది జట్టులో ఒక మార్పు జరిగింది. సమీర్ రిజ్వీ స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు.'అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.