న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(36 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 67), హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5) క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(10)ని మిచెల్ మార్ష్ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు అభిషేక్ శర్మ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో సన్రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లకు 62 పరుగులు చేసింది.

కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మార్క్రమ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను అన్రిచ్ నోర్జ్ నేలపాలు చేశాడు. కానీ ఈ అవకాశాన్ని మార్క్రమ్ అందిపుచ్చుకోలేకపోయాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో హ్యారీ బ్రూక్(0) కూడా డకౌటయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు అభిషేక్ చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను అదే జోరును కొనసాగించాడు. ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.
దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ 109 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ ధాటిగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. 6వ వికెట్కు 53 పరుగులు జోడించిన అనంతరం అబ్దుల్ సమద్ను మార్ష్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన అకీలా హోస్సెన్తో కలిసి క్లాసెన్ చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు.