
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆరెంజ్ ఆర్మీ ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 92 నాటౌట్), రోవ్మన్ పోవెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 67 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగారు. సన్రైజర్స్ బౌలర్లలో భువీ, సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 62), ఎయిడెన్ మార్క్రమ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 42) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ మూడు వికెట్లతో రాణించగా.. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ(4), కేన్ విలియమ్సన్(4) దారుణంగా విఫలమయ్యారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అభిషేక్.. నోర్జ్ వేసిన 5వ ఓవర్లో కేన్ విలియమ్సన్ క్యాచ్ ఔట్ అయ్యారు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో హైదరాబాద్ 2 వికెట్లకు 35 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం మిచెల్ మార్ష్.. రాహుల్ త్రిపాఠి(22) ఔట్ చేసి దెబ్బతీసాడు. క్రీజులోకి వచ్చిన పూరన్తో మార్క్రమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

104 మీటర్ల సిక్స్తో జోరు కనబర్చిన మార్క్రమ్ హాఫ్ సెంచరీ ముంగిట ఖలీల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్(10) విఫలమైనా.. నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్లో అతనికి సహకారం లభించకపోవడంతో ఒత్తిడికి గురైన పూరన్.. భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో సన్రైజర్స్ పరాజయం ఖాయమైంది.