న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తెలిపాడు. స్థానికుల సమాచారం ప్రకారం డ్యూ వచ్చే అవకాశం కూడా లేదన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
జట్టు ప్రయోగాల కథ ముగిసిందని, విజయాలు అందుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. జట్టులో ఆటగాళ్లు సత్తా చాటుతూ ఆటను ఆస్వాదించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. వాషింగ్టన్ సుందర్ దూరమవడం తీరని లోటని, అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారని చెప్పాడు. ఇప్పటి వరకు తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని చెప్పిన మార్క్రమ్.. సరైన స్కోర్లు కూడా నమోదు చేయలేదన్నాడు. బ్యాటింగ్ డెప్త్ పెంచడం కోసం జట్టులోకి అకీల్ హోస్సెన్, అబ్దుల్ సమద్లను తీసుకున్నామని చెప్పాడు.

మరోవైపు పరిస్థితులను అందిపుచ్చుకొని ఆడాల్సిన అవసరం ఉందని ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ అన్నాడు. తాము వరుసగా వికెట్లు కోల్పోతున్నామని, ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందన్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేయాలని, అదేవిధంగా తొలి 6 ఓవర్లు బౌలింగ్లో కూడా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంటా బయటా ఫార్మాట్లో మ్యాచ్ ఆడటం సవాల్గా ఉంటుందని చెప్పాడు. ఆమన్ ఖాన్ స్థానంలో ప్రియామ్ గార్గ్ అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు.
తుది జట్లు(అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(కీపర్), మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, ప్రియామ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్
సన్రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్(కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, అకీల్ హోస్సెన్, ఉమ్రాన్ మాలిక్