ఐపీఎల్ 2024 సీజన్లో అంపైర్ల ఘోర తప్పిదాలు పునరావృతమవుతున్నాయి. వారి చెత్త నిర్ణయాల కారణంగా మ్యాచ్ ఫలితాలు తారుమారవుతున్నాయి. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా ఓటమిపాలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. 222 పరుగుల లక్ష్యచేధనలో హాఫ్ సెంచరీతో దూకుడు కనబర్చిన సంజూ శాంసన్.. థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. అతను కొట్టిన ఓ భారీ షాట్ను బౌండరీ లైన్ వద్ద షై హోప్ అందుకున్నాడు.

అయితే క్యాచ్ అందుకునే క్రమంలో షై హోప్ కాలు బౌండరీ లైన్కు తాకినట్లు కనిపించింది. ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. థర్డ్ అంపైర్ రీప్లేలు పరిశీలించి ఔటిచ్చాడు. అయితే టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోకుండా తొందరపాటుతో థర్డ్ అంపైర్ ఈ నిర్ణయం ప్రకటించినట్లు అర్థమైంది. వివిధ కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకొని ఉంటే సంజూ శాంసన్ ఔటయ్యేవాడు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంపైర్ల తీరుపై సంజూ శాంసన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీజును వీడేందుకు కూడా నిరాకరించాడు. సంజూ శాంసన్ ఔటైన తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలింది. చివరకు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే సంజూ శాంసన్ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ సరైన నిర్ణయం తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించేదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

థర్డ్ అంపైర్ తీరును జహీర్ ఖాన్, నవ్ జ్యోత్ సింగ్ తప్పుబట్టారు. టెక్నాలజీని ఉపయోగించి నిర్ణయాన్ని ప్రకటించాల్సిందన్నారు. జహీర్ ఖాన్ మాట్లాడుతూ..'థర్డ్ అంపైర్ నిర్ణయం రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఢిల్లీ క్యాపిటల్స్కు అనుకూలంగా మార్చింది. టీవీ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు కాస్త సమయం తీసుకొని మరిన్ని యాంగిల్స్లో రీప్లేలను పరిశీలించాల్సింది. క్యాచ్ అందుకునే క్రమంలో ఫీల్డర్ బౌండరీ లైన్కు తాకినట్లు కనిపిస్తోంది.'అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
నవ్జ్యోత్ సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'సంజూ శాంసన్ వికెట్తో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. ఈ వికెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ రీప్లేలలను వివిధ కోణాల్లో పరిశీలిస్తే ఫీల్డర్ బౌండరీ లైన్కు తాకినట్లు కనిపిస్తోంది. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోకపోతే.. దానిన్ని వాడడమే దండుగ'అని నవ్జ్యోత్ సింగ్ అన్నాడు.