ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 65) విధ్వంసకర బ్యాటింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.
చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు జేక్ ఫ్రెజర్ మెక్గర్క్, అభిషేక్ పోరెల్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ముఖ్యంగా జేక్ ఫ్రెజర్.. వరుస బౌండరీలతో రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 4.1 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. జేక్ ఫ్రెజర్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే ధాటిగా ఆడే క్రమంలో జేక్ ఫ్రెజర్.. అశ్విన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన షైహోప్.. సందీప్ శర్మ సూపర్ త్రోకు రనౌట్గా వెనుదిరగ్గా.. అక్షర్ పటేల్ సాయంతో అభిషేక్ పోరెల్ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లకు 78 పరుగులు చేసింది.

అశ్విన్ అడ్డుకున్నా..
అనంతరం మరింత ధాటిగా ఆడిన అభిషేక్ పోరెల్ 28 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అక్షర్ పటేల్(15)ను ఔట్ చేసిన అశ్విన్.. సెంచరీ దిశగా సాగిన అభిషేక్ పోరెల్ను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(15) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. చాహల్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు.
ఈ పరిస్థితుల్లో ట్రిస్టన్ స్టబ్స్.. గుల్బాదిన్ నైబ్(19)తో కలిసి దూకుడుగా ఆడాడు. అయితే గుల్బాదిన్ నైబ్ను బౌల్ట్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన రసీక్ సలామ్తో కలిసి ట్రిస్టన్ స్టబ్స్ జట్టు స్కోర్ను 200 పరుగులు ధాటించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని సందీప్ శర్మ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ బౌండరీ బాదాడు. దాంతో ఢిల్లీ 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.