రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డ్ను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్లతో ఢిల్లీని ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 51 పరుగులుతో రాణించిన కోహ్లీ.. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఈ 51 పరుగుల ఇన్నింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్పై విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 1154 పరుగులు చేశాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. పంజాబ్ కింగ్స్పై అతను 1134 పరుగులు చేశాడు. ఈ జాబితాలో తర్వాతి రెండు స్థానాల్లోనూ కోహ్లీనే ఉండటం గమనార్హం. పంజాబ్పై 1104 పరుగులు చేసిన కోహ్లీ.. చెన్నై సూపర్ కింగ్స్పై 1098 రన్స్ కొట్టాడు. శిఖర్ ధావన్ చెన్నైపై 1105 పరుగులు చేశాడు.

ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
1,154* - విరాట్ కోహ్లీ vs ఢిల్లీ క్యాపిటల్స్
1,134 - డేవిడ్ వార్నర్ vs పంజాబ్ కింగ్స్
1,105 - శిఖర్ ధావన్ vs సీఎస్కే
1,104 - విరాట్ కోహ్లీ vs పంజాబ్ కింగ్స్
1,098 - విరాట్ కోహ్లీ vs సీఎస్కే
ఏడో విజయం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41), ట్రిస్టన్ స్టబ్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కృనాల్ పాండ్యా(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. చమీర ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఆర్సీబీకి ఏడో విజయం. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్ బెర్త్కు అడుగు దూరంలో నిలిచింది.