ముంబై: మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), బర్త్డే బాయ్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు పంజాబ్ కింగ్స్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరికి తోడుగా చివర్లో దీపక్ హుడా(13 బంతుల్లో 2 సిక్స్లతో 22 నాటౌట్), షారుఖ్ ఖాన్(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 15 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లుక్మాన్ మెరివాలా, కగిసోరబడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి శుభారంభాన్ని అందించారు. ఢిల్లీ ఫీల్డర్లు చేసిన తప్పిదాలతో చెలరేగిన ఈ జోడీ తొలి వికెట్కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే వీరి జోరుతో ఒకానొక దశలో పంజాబ్ సులువుగా 200 ప్లస్ స్కోర్ చేస్తుందనిపించింది. కానీ ఢిల్లీ బౌలర్లు పుంజుకొని 200లోపే కట్టడి చేశారు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(11), నికోలస్ పూరన్(9) తీవ్రంగా నిరాశపరిచారు.