ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మిచెల్ మార్ష్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. చివర్లో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లతో ఉత్కంఠకు తెరలేపినా ఫలితం లేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్( 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్), షై హోప్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. డేవిడ్ వార్నర్(28), మిచెల్ మార్ష్(20), రిషభ్ పంత్(18), అక్షర్ పటేల్(21) పర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. సామ్ కరణ్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 63) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. లియామ్ లివింగ్స్టోన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 38) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
చివరి మూడు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ విజయానికి 28 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన మిచెల్ మార్ష్.. 18 పరుగులు ఇచ్చాడు. సామ్ కరణ్ 6, 4 బాదగా.. లివింగ్ స్టోన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. దాంతో మ్యాచ్ ముమెంటమ్ పంజాబ్ వైపు మళ్లింది. 19వ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ వరుసగా బంతుల్లో సామ్ కరణ్, శశాంక్ సింగ్ను ఔట్ చేసి 2 పరుగులే ఇచ్చాడు.
దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 6 బంతుల్లో 6 పరుగులు అవసరమవ్వగా.. లివింగ్ స్టోన్ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మిచెల్ మార్ష్ కాస్త కట్టడిగా చేసినా.. హర్ప్రీత్ బ్రార్ ఇచ్చిన క్యాచ్ వార్నర్ పట్టుకున్నా ఫలితం మరోలా ఉండేది.