న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో ప్రభ్సిమ్రాన్ సత్తా చాటగా.. బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్ రఫ్ఫాడించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా నిష్క్రమించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 103) సెంచరీతో ఓంటరి పోరాటం చేశాడు. ప్రభ్సిమ్రాన్ తర్వాత సామ్ కరణ్(20) ఒక్కడే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.

ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్(27 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 54), ఫిల్ సాల్ట్(17 బంతుల్లో 3 ఫోర్లతో 21) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ (4/30) నాలుగు వికెట్లతో సత్తా చాటగా..నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా వార్నర్ బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. 28 బంతుల్లోనే వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పవర్ ప్లే అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పిన్నర్ను రంగంలోకి దింపగా ఢిల్లీ పతనం మొదలైంది. హర్ప్రీత్ బ్రార్, దీపక్ చాహర్ వరుస ఓవర్లలో ఫిల్ సాల్ట్(21), మిచెల్ మార్ష్(3) ఔట్ చేయడంతో తొలి వికెట్కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హర్ప్రీత్ బ్రార్ తన మరుసటి ఓవర్లో రిలీ రోసౌ(5)తో పాటు క్రీజులో సెట్ అయిన వార్నర్ను ఔట్ చేశాడు.
ఆ వెంటనే అక్షర్ పటేల్(1)ను చాహర్ ఔట్ చేయడంతో 86 పరుగులకే ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయింది. 17 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మనీశ్ పాండే(0)ను హర్ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అమన్ ఖాన్(16)ను ఎల్లిస్ పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. నాథన్ ఎల్లిస్ దెబ్బకొట్టాడు. ప్రవీణ్ దూబే(16)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో కుల్దీప్, ముఖేశ్ కుమార్ మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు.