చెలరేగిన షా, ధావన్
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు పృథ్వీ షా(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32), శిఖర్ ధావన్ మంచి శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే శిఖర్ ధావన్ బౌండరీల ఖాతా తెరవగా.. షమీ వేసిన మరుసటి ఓవర్లో పృథ్వీ షా ఫోర్, సిక్సర్తో దూకుడు కనబర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో ధావన్ రెండు బౌండరీలు బాదగా.. జైరిచర్డ్సన్ బౌలింగ్లో షా మరో ఫోర్, సిక్సర్తో చెలరేగాడు. అనంతరం షమీ ఓవర్లో ధావన్ మూడు బౌండరీలు సాధించాడు. కానీ ఆ మరుసటి ఓవర్లోనే అర్షదీప్ సింగ్ ఈ జోడీని విడదీశాడు. స్లోయర్ బాల్కు పృథ్వీ షాను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో ఫస్ట్ వికెట్కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్తో ధావన్ కొంచెం ఓపికగా ఆడటంతో పవర్ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 62 రన్స్ చేసింది.
ధావన్ సెంచరీ మిస్..
ఆ తర్వాత పంజాబ్ కొంచెం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. హుడా వేసిన 9వ ఓవర్లో ధావన్ రెండు బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో జై రిచర్డ్సన్ వేసిన 10వ ఓవర్లో సెకండ్ బాల్కు క్విక్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గబ్బర్... ఆ తర్వాత అదే జోరులో ఓ భారీ సిక్సర్ కొట్టాడు. మరోవైపు క్రీజులో కొంత తడబడిన స్మిత్(9) భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ పంత్ క్రీజులోకి రాగా.. ధావన్ తన దూకుడును కొనసాగించాడు. మెరిడిత్ వేసిన 14 ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్స్ బాదాడు. అయితే సెంచరీకి చేరువైన ధావన్ను రిచర్డ్సన్ సూపర్బ్ బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. స్వీప్ షాట్ ఆడబోయిన ధావన్ బంతిని తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు.
స్టోయినిస్ మెరుపులు..
చివరి 24 బంతుల్లో ఢిల్లీ విజయానికి 36 రన్స్ అవసరం కాగా.. షమీ వేసిన 17 ఓవర్లో స్టోయినిస్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో 20 రన్స్ వచ్చాయి. అయితే ఆ మరుసటి ఓవర్లోనే రిషభ్ పంత్ క్యాచ్ ఔట్గా వెనుదిరగడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో లలిత్ యాదవ్(12), స్టోయినిస్ ఢిల్లీ విజయ లాంచనాన్ని 10 బంతులుండగానే పూర్తి చేశారు. ఇక పంజాబ్ బౌలర్ల వైఫల్యం ఢిల్లీకి కలిసొచ్చింది. కీలక సమయంలో నోబాల్స్ వేసిన ఆ టీమ్ బౌలర్లు మూల్యం చెల్లించుకున్నారు.