న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో.. ముంబై ఫీల్డర్ల తప్పిదాలతో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్.. ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు.
సునాయసంగా ఆపాల్సిన బౌండరీలను విడిచిపెట్టడం.. క్యాచ్లు నేలపాలు చేయడాన్ని రోహిత్ సహించలేకపోయాడు. 'ఏం ఫీల్డింగ్ రా అయ్యా'అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు. ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రెండు క్యాచ్ల నేలపాలు చేయడాన్ని రోహిత్ ఏ మాత్రం సహించలేకపోయాడు. తీవ్ర ఆగ్రహంతో నెత్తికి తల పెట్టుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వరుస పరాజయాల నేపథ్యంలో రోహిత్ తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు అనిపించింది. అతని ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా స్పాట్ ఆన్ లేదు. మొత్తానికి సరైన సమయంలో బౌలర్లను మార్చిన రోహిత్ ఆశించిన ఫలితాన్ని అందుకున్నాడు.
అక్షర్ పటేల్ కొట్టిన భారీ షాట్.. బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్య చేతిలోకి రాగా.. అతను నేలపాలు చేశాడు. క్యాచ్ అందుకునే విషయంలో సూర్య అలసత్వం ప్రదర్శించడంతో బంతి అతని నుదిటికి తాకి బౌండరీ బయట పడింది. క్యాచ్ నేలపాలవ్వడంతో పాటు సిక్సర్గా వెళ్లడంతో రోహిత్ కోపం రెండింతలు అయ్యింది. తీవ్ర గాయంతో సూర్య మైదానం వీడాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 51), అక్షర్ పటేల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా(3/22), జాసన్ బెహెండార్ఫ్(3/23) మూడేసి వికెట్లతో చెలరేగగా.. రిలే మెరిడిత్ రెండు వికెట్లు, హృతిక్ షోకీన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 31) శుభారంభం అందించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకుంది. రోహిత్ అత్యుత్సాహంతో సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. ఇషాన్ కిషన్ బలయ్యాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో రోహిత్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు.